బాగ్దాద్ ఎయిర్ పోర్టుపై దాడి... ఇరాన్ కీలక నేత హతం

By telugu teamFirst Published Jan 3, 2020, 9:15 AM IST
Highlights

ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధినేత జనరల్ ఖాసీం సోలేమన్ కూడా ప్రాణాలు వదిలారు. ఈ విషయాన్ని ఇరాక్ మీడియా వర్గాలు, మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపారు.
 

ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కొత్త ఏడాది రోజున ఇరాన్ మద్దతుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఏకంగా రాకెట్ దాడి జరిగింది.

శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడి జరపగా... ఈ దాడిలో ఇరాన్, ఇరాక్ కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది ప్రాణాలు వదిలారు. దీనిలో ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధినేత జనరల్ ఖాసీం సోలేమన్ కూడా ప్రాణాలు వదిలారు. ఈ విషయాన్ని ఇరాక్ మీడియా వర్గాలు, మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ దాడికి పాల్పడింది ఎవరనేది ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇరాన్ అధ్యక్షుడు అయతోల్లా అలీ ఖమేనీ తర్వాత ఖాసీం సులేమాన్ అత్యంత శక్తివంతమైన నేత. ఇరాక్ ప్రాంతంలో భద్రతా కార్యకలాపాలు, దౌత్య సంబంధాలు, తదితర అంశాలలో ఈయనే కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ రాకెట్ దాడిలో ఇరాక్ పాపులర్ మొబిలైజేషన్ యూనిట్ డిప్యూటీ అధికారి, ఇరాన్ ఐబీ చీఫ్ సులేమాన్‌కు సన్నిహితుడైన ముహదీస్ అబు మహదీ అల్ ముహదస్ సైతం మృతిచెందినట్టు భావిస్తున్నారు.

రెండు రోజుల కిందట ఇరాన్ మద్దతుదారులు ఇరాక్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్‌లో తమ రాయబార కార్యాలయంపై దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వెంటనే అక్కడకు అదనపు బలగాల్ని పంపారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

click me!