
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను తీసుకురావడానికి భారత్.. ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఇప్పటికే వేల మంది భారత పౌరులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకువచ్చింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. నేడు ఆపరేషన్ గంగా చివరిదశ ప్రారంభం అవుతుందనీ, ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత పౌరులు బుడాపెస్ట్ కు చేరుకోవాలనీ, తమ వివరాలను అందించాలని గూగుల్ ఫారమ్ ను అందుబాటులో ఉంచింది భారత రాయబార కార్యాలయం.
ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం నాడు భారత పౌరులను తరలించే ఆపరేషన్ గంగా చివరి దశను ప్రారంభించింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులు తాము ఉంటున్న నివాసాలను వదిలి వెంటనే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్లోని హంగేరియా సిటీ సెంటర్కు చేరుకోవాలని కోరింది. ట్వీట్టర్ లో "ముఖ్యమైన ప్రకటన: భారత రాయబార కార్యాలయం ఈరోజు ఆపరేషన్ గంగా విమానాల చివరి దశను ప్రారంభించింది. వారి స్వంత వసతి (ఎంబసీ ద్వారా ఏర్పాటు చేయబడినవి కాకుండా) ఉన్న విద్యార్థులందరూ @Hungariacitycentre, Rakoczi Ut 90, బుడాపెస్ట్కు ఉదయం 10-12 గంటల మధ్య చేరుకోవాలని కోరుతున్నాం" అని పేర్కొంది.
ఇంతకుముందు చేసిన ట్వీట్లో.. ఉక్రెయిన్లో ఇప్పటికీ చిక్కుకుపోయిన భారత పౌరులను ప్రాథమిక వివరాలను పేర్కొన్న ఫారమ్ను పూరించమని రాయబార కార్యాలయం అభ్యర్థించింది. ఎంబసీ అధికారిక ట్విట్టర్ ఖాతా.. అక్కడ చిక్కుకుపోయిన వారి పేరు, పాస్పోర్ట్ నంబర్ మరియు ప్రస్తుత లొకేషన్ వంటి ప్రాథమిక వివరాలను కోరుతూ గూగుల్ ఫారమ్ను పోస్ట్ చేసింది. "ఇప్పటికీ ఉక్రెయిన్లో ఉన్న భారతీయ పౌరులందరూ అటాచ్ చేసిన Google ఫారమ్లో ఉన్న వివరాలను అత్యవసర ప్రాతిపదికన పూరించాలని అభ్యర్థించబడింది. సురక్షితంగా.. ధైర్యంగా ఉండండి" అంటూ ట్వీట్ చేసింది.
కాగా, తూర్పు ఉక్రెయిన్లోని సంఘర్షణ ప్రాంతాలలో వందలాది మంది భారతీయ విద్యార్థులు ఇప్పటికీ చిక్కుకుపోయారని, వారిని తరలించడానికి బస్సులను ఏర్పాటు చేయడం ప్రస్తుతం అతిపెద్ద సవాలుగా మారిందని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. కాగా, ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఆపరేషన్ గంగా కింద 63 విమానాల ద్వారా ఇప్పటివరకు ఉక్రెయిన్ నుండి 13,300 మంది భారతదేశానికి తిరిగి వచ్చారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. గత 24 గంటల్లో 15 విమానాలు 2,900 మందిని స్వదేశానికి తీసుకువచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 21 వేల మంది భారత పౌరులు ఉక్రెయిన్ ను విడిచిపెట్టారు.
ఆపరేషన్ గంగాపై ప్రత్యేక బ్రీఫింగ్లో MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, "పిసోచిన్ మరియు ఖార్కివ్ నుండి, మేము రాబోయే కొద్ది గంటల్లో భారత పౌరులందరినీ తరలిస్తాం. ఇప్పటివరకు దాదాపు భారతీయులందరూ ఖార్కివ్ను ఖాళీ చేసినట్టు సమాచారం" అని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిపై దృష్టి పెట్టినట్టు వెల్లడించారు.