బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్.. కింగ్ చార్లెస్ ‘‘రాజ’’ ముద్ర, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం

By Siva KodatiFirst Published Oct 25, 2022, 4:36 PM IST
Highlights

బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా రిషి సునాక్ నియామకానికి రాజముద్ర లభించింది. మంగళవారం బకింగ్‌హామ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ IIIని కలిశారు రిషి సునాక్. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించారు కింగ్ చార్లెస్. 

బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునాక్ మంగళవారం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానిగా తనకు పూర్తి మద్ధతు వుందని , ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు రిషి సునాక్. దీనికి సమ్మతించిన కింగ్ చార్లెస్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా రిషి సునాక్‌ను కోరారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం రిషి సునాక్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిగా లిజ్ ట్రస్ తనవంతు ప్రయత్నం చేశారని అన్నారు. ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సునాక్ అన్నారు. బ్రిటన్ ప్రజలు తనపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు. 

ఇకపోతే... బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునక్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సరిగ్గా దీపావళి నాడు పెన్నీ మోర్డెంట్ రేసు నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో సునక్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో యూకే  మొదటి భారతీయ సంతతి, మొదటి హిందూ, మొదటి శ్వేతజాతీయేతర ప్రధాన మంత్రిగా రికార్డు నెలకొల్పారు. 

ALso REad: చరిత్ర సృష్టించబోతున్న రిషి సునక్.. 200 ఏళ్లలో బ్రిటన్ కు అతి చిన్న వయస్సులో ప్రధానిగా పగ్గాలు

రెండు నెలల కిందట నాయకత్వ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 100 మంది ఎంపీల నామినేషన్ల పరిమితిని క్లియర్ చేసిన ఏకైక అభ్యర్థి అయ్యారు. దీంతో ఆటోమెటిక్ గా తదుపరి కన్జర్వేటివ్ నాయకుడు, బ్రిటిష్ ప్రధాన మంత్రిగా ఎంపికయ్యారు. మధ్యాహ్నం 1.59 గంటలకు హౌస్ ఆఫ్ కామన్స్ నాయకుడు మోర్డాంట్ ప్రధాని రేసు నుంచి వైదొలుగుతున్నట్టు ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు రిషి మనకు ఖచ్చితంగా అవసరమని తోటి నాయకులు భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. వారు మంచి విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రిషితో కలిసి పని చేయడానికి రుణపడి ఉంటాం. రిషికి నా పూర్తి మద్దతుద్ద ఉంది.’’ అని పేర్కొన్నారు. 

ఈ పరిణామాల వల్ల బ్రిటన్ కు 200 ఏళ్లలో అతి చిన్న వయస్సులో రిషి (42 సంవత్సరాలు) ప్రధాని అయ్యారు. 1812 తరువాత ఇంత తక్కువ వయస్సున్న వ్యక్తి ప్రధాని కావడం ఇదే ప్రథమం. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి కుమార్తె, రిషి భార్య అక్షతా మూర్తి, తన ఇద్దరు పిల్లలతో కలిసి అధికారిక భవనంలో నివసించనున్నారు. ఎంపీగా ఎన్నికైన ఏడు సంవత్సరాల అతి తక్కువ సమయంలో ఆయన ఉన్నత పదవిని అధిరోహించడం విశేషం.

click me!