
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన పాకిస్థాన్ ప్రధాని గా ఉన్నప్పుడు.. బహుమతిగా పొందిన ఓ బంగారు గొలుసు ప్రభుత్వ ఖజానా నుంచి మాయమైందని అధికారులు గుర్తించారు. ఈ బంగారు గొలుసు విలువ దాదాపు రూ. 18 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ బంగారు గొలుసును తాను అధికారంలో ఉన్నప్పుడు.. ఓ ప్రైవేటు వ్యాపారికి అమ్మివేసినట్టు.. స్థానిక మీడియా సంస్థలలో పలు ఆరోపణలు వచ్చాయి.
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో.. ఆయన బహుమతిగా లభించిన ఖరీదైన బంగారు గొలుసును తోషా-ఖానా (స్టేట్ గిఫ్ట్ రిపోజిటరీ)కి పంపలేదని అధికారులు గుర్తించారు. దీన్ని ఆయన అసిస్టెంట్ జుల్పికర్ బుఖారీ సహయంతో లాహోర్ లోని నగల వ్యాపారికి 18 కోట్లకు విక్రయించారని పలు వార్త కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ విషయాన్ని పాకిస్థాన్ అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీరియస్ గా తీసుకుంది. ఇమ్రాన్ పై విచారణ చేపట్టింది. ప్రస్తుతం పాక్ లో ఘటన కలకలం సృష్టిస్తోంది.
ప్రముఖుల నుంచి పొందిన బహుమతులను సగం ధర చెల్లించి.. తమ వద్ద ఉంచవచ్చు, అయితే గత వారం పార్లమెంటులో అవిశ్వాస ఓటుతో ఓడిపోయిన ఖాన్ కొన్ని లక్షల రూపాయలను జాతీయ ఖజానాలో జమ చేశాడు, ఇది చట్టవిరుద్ధమని నివేదిక పేర్కొంది. పాకిస్థాన్ చట్టం ప్రకారం.. రాష్ట్ర అధికారులు ప్రముఖుల నుండి స్వీకరించే బహుమతులను తోషా-ఖానాలో సమర్పించాలి. వారు బహుమతిని సమర్పించడంలో విఫలమైతే.. అది చట్టవిరుద్ధమైన చర్య.