దారుణం.. భార్య గొంతు కోసి ఫేవరేట్ మ్యూజిక్ వినిపించాడు.. మరణించే వరకు చేతిని పట్టుకునే..!

By Mahesh KFirst Published Jun 24, 2022, 8:12 PM IST
Highlights

అమెరికాలో ఓ వ్యక్తి అతి కిరాతకంగా తన భార్యను హతమార్చాడు. గొంతు కోసి బాత్ టబ్‌లో ఉంచి ఆమెకు ఇష్టమైన మ్యూజిక్ వినిపించాడు. మరణించే వరకు ఆమె చేతిని పట్టుకునే ఉన్నాడు. సుమారు పది నిమిషాల తర్వాత ఆమె మరణించినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు.
 

న్యూఢిల్లీ: అమెరికాలో ఓ వ్యక్తి తన భార్యను చిత్రహింసలు పెట్టి చంపేశాడు. దాడి ప్రారంభించగానే ఆమె ప్రాణ రక్షణ కోసం తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ, ఆ వ్యక్తి బలవంతంగా భార్యను అదుపులోకి తీసుకుని గొంతు కోశాడు. బాత్ టబ్‌లో పడుకోబెట్టి.. ఒక వైపు ఆమె మెడ నుంచి రక్తం కారుతుండగా ఆమెకు ఇష్టమైన మ్యూజిక్ పెట్టాడు. కొన ఊపిరితో తల్లడిల్లుతూ రక్తం కారుతూ ఆమె మరణించింది. ఆమెకు ఇష్టమైన మ్యూజిక్ పెట్టి.. మరణించే వరకు ఆమె చేతిని తన చేతిలో పట్టుకునే ఉన్నాడు. ఈ ఘటన ఫ్లోరిడా రాష్ట్రంలోని బల్లార్డ్ స్ట్రీట్‌లో మంగళవారం చోటుచేసుకుంది.

అక్కడ షిచెన్ యాంగ్ (21), ఆయన భార్య నూ ఖిన్ ఫామ్‌ దంపతులు జీవిస్తున్నారు. యాంగ్ స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్‌కు సంబంధించిన పని చేస్తున్నాడు. మంగళవారం ఆయన తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. చంపేయడమే కాదు.. ఆధారాలు అన్నింటినీ తుడిచేస్తున్నట్టు వివరించాడు. పోలీసులు వెంటనే స్పాట్‌కు వెళ్లారు. ఆ ఫ్లాట్‌లో బాత్ టబ్‌లో ఫామ్ రక్తపు మడుగులో కనిపించింది. ఆమె మెడ పదునైన ఆయుధంతో కోసినట్టుగా ఉన్నది. ఆమె పొట్టలోనూ రక్తపు మరకలు ఉన్నాయి. పోలీసులు స్పాట్‌కు రాకముందే యాంగ్ పారిపోయాడు. స్వల్పకాలంలోనే పోలీసులు యాంగ్‌ను పట్టుకున్నారు.

పోలీసు విచారణలో యాంగ్ తాను చేసిన దారుణాన్ని అంగీకరించాడు. చిన్న గొడవ వల్ల తాను చాలా కోపంతో ఊగిపోయాడని, ఆ తర్వాతే భార్యను చంపేసినట్టు వివరించాడు. గొడవ కారణంగా తనలో కోపం పెరుగుతూనే ఉండిందని, అయితే, తాను తలుచుకుంటే హత్య చేయకుండా నియంత్రించుకోగలిగేవాడినే అని చెప్పాడు. మరి ఎందుకు తనను తాను ఆపుకోలేడని అడగ్గా.. తాను ఏదైనా మొదలు పెడితే.. పూర్తి చేసే వరకు ఆపనని, తాను అలాగే పెరిగానని అన్నాడు. 

ముందు ఫామ్ గొంతు కోసి ఆ తర్వాత బాత్ టబ్‌ దగ్గరకు తీసుకెళ్లానని వివరించాడు. బాత్‌ రూమ్ టబ్‌లో ఉంచానని తెలిపాడు. అప్పుడు ఆమెకు ఇష్టమైన మ్యూజిక్ ప్లే చేశానని అన్నాడు. ఆమె చేతిని పట్టుకుని గడిపానని చెప్పాడు. సుమారు పది నిమిషాల తర్వాత ఆమె చనిపోయిందని తెలిపాడు. ఆమె మరణించే వరకు చేతిని పట్టుకునే ఉన్నానని పేర్కొన్నాడు. 

ఆమె మరణించిందని నిర్ధారించుకున్నాక గోడలు, ఫ్లోర్‌పై రక్తపు మరకలను తుడవడం మొదలు పెట్టాడని చెప్పినట్టు పోలీసులు వివరించారు. 

అనంతరం, యాంగ్ పని చేస్తున్న పూల్ మెయింటెనెన్స్ కంపెనీ తో పోలీసులు మాట్లాడారు. యాంగ్ మంగళవారం పనికి రాకపోవడంతో ఆయనకు ఫోన్ చేశానని, ఎందుకు రాలేవని అడిగానని వివరించారు. తాను తన భార్య వల్ల అప్‌సెట్ అయి ఉన్నానని, భార్య తన పాస్‌పోర్టును తగుల బెట్టిందని చెప్పినట్టు పేర్కొన్నారు. అలా నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నావని తాను మందలించానని, ఆ తర్వాత యాంగ్ తన భార్యను చంపేసినట్టు చెప్పాడని వివరించారు. ఆమెపై చెప్పరాని విధంగా దాడి చేశానని పేర్కొన్నట్టు తెలిపారు.

click me!