
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులు అన్నింటితోపాటు ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాలని ఆశించిన 23 మంది రెబల్ గ్రూపులో ఆజాద్ ఉన్నారు. పలు సూచనలు కూడా చేశారు. వారు ఈ మార్పులు సూచించి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సందర్భంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖలో కాంగ్రెస్తో తన ప్రయాణం గురించి ప్రస్తావించారు. పార్టీలో జరిగిన మార్పుల గురించి చర్చిస్తూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు.
1970వ దశకంలో తాను జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ యూనిట్లో చేరానని ఆయన తన ప్రస్థానాన్ని గురించి వివరించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్ర అప్పుడు అల్లకల్లోలంగా ఉన్నదని, ముఖ్యంగా జమ్ము కశ్మీర్ రాజకీయాల్లో ప్రముఖుడైన షేక్ మొహమ్మద్ అబ్దుల్లా అరెస్టుతో రాష్ట్రంలో కాంగ్రెస పట్ల వ్యతిరేకత ఎక్కువగా నెలకొందని తెలిపారు. ఆ సమయంలో తాను కాంగ్రెస్లో చేరినట్టు తెలిపారు. సంజయ్ గాంధీ సూచనల మేరకు తాను ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు తీసుకున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం, సాధించిన విజయాలు, సుపరిపాలన గురించి ఆయన రాసుకొచ్చారు. ఇందిరా గాంధీ మొదలు, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహా రావు, డాక్టర్ మన్మోహన్ సింగ్ వరకు.. వారి సారథ్యంలో నడిచిన ప్రభుత్వాల్లో విశేష సేవలు అందించే అవకాశం లభించిందని తెలిపారు.
సోనియా గాంధీ సారథ్యంలోనూ యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వం కూడా విజయవంతంగా మంచి పాలన అందించిందని వివరించారు. అందులోనూ తాను కేంద్రమంత్రిగా చేసినట్టు తెలిపారు. సోనియా గాంధీ విజయవంతంగా పార్టీని నడపడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆమె తన సీనియర్ల విలువైన అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవడం, వారికి సరైన అధికారాలనూ అప్పగించడం ఉన్నదని తెలిపారు. కానీ, రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో పరిస్థితులు మారిపోయాయని వివరించారు.
రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు
2013 జనవరిలో రాహుల్ గాంధీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత దురదృష్టవశాత్తు ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయని వివరించారు. ఆయనను పార్టీ ఉపాధ్యక్షుడిగా సోనియా నియమించిన తర్వాత అంతకు ముందు ఉన్న సంప్రదింపుల మెకానిజాన్ని పూర్తిగా ఆయన నాశనం చేశారని మండిపడ్డారు.
సీనియర్, నిపుణులైన నేతలను ఆయన పక్కన పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చుట్టూ ఒక కొత్త కోటరీ ఏర్పడిందని, అందులో అనుభవం లేని సైకోలు ఉన్నారని వివరించారు. వారే పార్టీ వ్యవహారాలను నడపడం మొదలైందని పేర్కొన్నారు.
ఇందుకు స్పష్టమైన ఉదాహరణ 2014 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ మీడియా ముందు బాహాటంగా చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆర్డినెన్స్ కాపీని ఆయన బాహాటంగాా చింపేయటాన్ని ఆక్షేపించారు. అప్పటి (మన్మోహన్ సింగ్ ప్రభుత్వం) ప్రభుత్వం తెచ్చిన ఓ ఆర్డినెన్స్ను తప్పుపట్టడం రాహుల్ గాంధీ ఇమ్మెచ్యూరిటీకి నిదర్శనం అని తెలిపారు. ఆ ఆర్డినెన్స్ను కాంగ్రెస్ కోర్ గ్రూప్ ఆలోచనల్లోనే పుట్టిందని వివరించారు. ఆ ఆర్డినెన్స్ను ప్రధాని సారథ్యంలోని కేంద్ర మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలతో ప్రధాని, కేంద్ర ప్రభుత్వ అధికారాలను తక్కువ చేశారని తెలిపారు. ఈ ఒక్క చర్యనే 2014లో యూపీఏ ప్రభుత్వం ఓడిపోవడానికి పెద్ద కారణంగా మారిందని వివరించారు. ఆయన వ్యాఖ్యలు రైట్ వింగ్ శక్తులకు, కొన్ని కార్పరేట్ దుష్ట ప్రయోజనాలకు ఆలవాలమయ్యాయని ఆరోపించారు.