
స్టాక్ హోమ్: రసాయనశాస్త్రం విభాగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ ఏడాది ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఫ్రాన్సెస్ హెచ్ అర్నాల్డ్, పరిశోధకులు జార్జ్ పి. స్మిత్, బ్రిటన్కు చెందిన పరిశోధకులు సర్ గ్రెగొరీ పి. వింటర్ లు ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రొటీన్లను ఉపయోగించి జీవవైవిధ్య ఇంధనం నుంచి ఔషధాల తయారీ వరకు వివిధ రంగాల్లో వినూత్నమైన పరిశోధనలకు గానూ ముగ్గురికి అవార్డు వరించింది.
ఈ అవార్డు కింద అందే రూ. 7.35కోట్లలో సగం సొమ్మును ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్కు, మిగతా మొత్తాన్ని జార్జ్ స్మిత్, గ్రెగొరీ వింటర్కు పంచుతున్నట్లు ఎంపిక కమిటీ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.
రసాయన శాస్త్రంలో నోబెల్ అందుకున్న ఐదో మహిళగా ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్ ఘనత సాధించారు. అంతకుముందు మరియా స్కోలోడోవోస్కా క్యూరీ(1911), ఇరెనె జోలియట్ క్యూరీ(1935), డొరొతీ క్రోఫూట్ హాడ్కిన్(1964), అడా ఇ. యోనత్(2009) రసాయన శాస్త్రంలో నోబెల్ అందుకున్నారు.
ఈ ఏడాది నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం నుంచి ప్రారంభమైంది. సోమవారం వైద్య రంగంలో, మంగళవారం భౌతిక రంగంలో అవార్డులను ప్రకటించారు. అక్టోబరు 5న నోబెల్ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారాల విజేతలను వెల్లడించనున్నారు. లైంగిక ఆరోపణల కారణంగా ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించడం లేదని నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది.