
‘కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అందిస్తాను. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం ప్రకటిస్తాను’’ అంటూ ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ ఓ నయా సవాల్ని తెర మీదకు తెచ్చారు.
సాంకేతికత పెరిగిన కొద్ది కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అభివృద్ది మోజులో పడి ప్రకృతికి పూడ్చలేని నష్టం చేస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కర్భన ఉద్గారాలు. అభివృద్ధి పెరిగిన కొద్ది ఉద్గారాలు ఎక్కువవుతున్నాయి. దాంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు.. అతివృష్టి, అనావృష్టి తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ ఈ సవాల్ విసిరారు. అంతే కాదు, గెలిచిన వారికి 100 మిలియన్ డాలర్ల(7,30,05,50,000 రూపాయలు) భారీ ప్రైజ్ మనీని కూడా ప్రకటించారు.
ఇంతకు చాలెంజ్ ఏంటంటే.. కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేయాలి. వాతావరణ మార్పులను అదుపులో ఉంచే అనేక ప్రణాళికలలో భూమిని వేడేక్కించే ఉద్గారాలను సంగ్రహించడం చాలా కీలకమైనదిగా మారుతోంది. కాని ఈ రోజు వరకు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వెనకబడే ఉన్నాం. గాలి నుంచి కార్బన్ను బయటకు తీయడం కంటే ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ తన ట్విట్టర్ వేదికగా.. ‘‘కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అందిస్తాను. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం ప్రకటిస్తాను’’ అంటూ ట్వీట్ చేశారు.
ఇక గతేడాది చివర్లో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దేశాలు గనుక నికర సున్నా ఉద్గారలను చేరుకోవాలంటే వాటిని సంగ్రహించే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.