చైనాలో ఆదివారంనాడు ఒక్క రోజే కరోనా వైరస్ బారిన పడి 57 మంది మరణించారు. దీంతో కరోనా వైరస్ మరణాల సంఖ్య చైనాలో 361కి చేరుకుంది. వూహన్ లో రికార్డు టైమ్ లో ఆస్పత్రిని ప్రారంభించారు.
బీజింగ్: కరోనా వైరస్ తో చైనా గజగజ వణికిపోతోంది. ఆదివారంనాడు ఒక్క రోజే కరోనా వైరస్ తో 57 మంది మృత్యువాత పడ్డారు. దాంతో మృతుల సంఖ్య 361కి చేరుకుంది. ఈ విషయాన్ని చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
హుబై ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం వివరాల ప్రకారం ప్రోవిన్స్ లో అదనంగా 2,103 కేసులు నమోదయ్యాయి. దాంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య 16,600కు చేరుకుంది. మొత్తం చైనాలో 17,205 కేసులు నమోదయ్యాయి.
also Read: భారత్ లో రెండో కరోనా వైరస్ కేసు: భారత్ సంచలన ఆదేశాలు
ఇదిలావుంటే, అమెరికాలో 9 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలో నలుగురికి, ఇల్లినోయిస్ లో ఇద్దరికి, మాస్సాచుసెట్స్ లో ఒకరికి, వాషింగ్టన్ లో ఒకరికి, అరిజోనాలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
చైనాలో ఆదివారం సంభవించిన మృతుల్లో 56 మంది హుబై ప్రొవిన్స్ లో, ఒకరు చోంగ్ కింగ్ ప్రొవిన్స్ నమోదయ్యాయి. ఆదివారంనాటి కేసుల్లో 186 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉండగా, 147 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. మొత్తం 475 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు.
Also Read: కరోనా వైరస్ దెబ్బకు చైనా స్టాక్ మార్కెట్లు విలవిల
ఇదిలావుంటే, చైనా వూహన్ లో 10 రోజుల్లో యుద్ధప్రాతిపదికపై వేయి పడకల ఆస్పత్రిని తెరిచింది. 2,300 పడకలతో మరో ఆస్పత్రిని బుధవారంనాడు ప్రారంభించనున్నారు.