చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. పలుచోట్ల లాక్ డౌన్

By telugu news teamFirst Published Jun 13, 2020, 12:50 PM IST
Highlights

జిన్ఫాడీ మీట్ మార్కెట్‌లో ఇప్పటి వరకు ఏడు కరోనా కేసులు గుర్తించగా.. అందులో ఆరు కేసులు ఇవాళ ఒక్కరోజే వచ్చాయని అధికారులు తెలిపారు. 
 

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కొన్ని లక్షల మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని లక్షల మంది వైరస్ సోకి ఇబ్బందిపడుతున్నారు. కాగా.. ఈ వైరస్  తొలుత పుట్టింది చైనాలో. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు పాకేసింది.

కాగా.. చైనాలో తగ్గినట్లే తగ్గి వైరస్ మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. రాజధాని బీజింగ్‌లో అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్లో కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో.. అధికారులు అక్కడ ఆగమేఘాల మీద లాక్‌డౌన్ విధించారు. జిన్ఫాడీ మీట్ మార్కెట్‌లో ఇప్పటి వరకు ఏడు కరోనా కేసులు గుర్తించగా.. అందులో ఆరు కేసులు ఇవాళ ఒక్కరోజే వచ్చాయని అధికారులు తెలిపారు. 

అంతకు ముందు గురువారం మరో కేసును గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ మార్కెట్‌తో పాటు సమీపంలోని తొమ్మిది స్కూళ్లను మూసివేసినట్టు అధికారులు వెల్లడించారు. జిన్ఫాడీ మార్కెట్లో మొత్తం 4 వేల దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ వైరస్ ఉన్నట్టు గుర్తించడంతో మొత్తం అన్ని షాపులను శానిటైజ్ చేసినట్టు అధికారిక జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 

ఈ మార్కెట్‌లోని మొత్తం సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 50 రోజుల తర్వాత మళ్లీ ఇక్కడ సామాజిక వ్యాప్తి కేసులు గుర్తించినట్టు నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది. 

click me!