ప్రపంచవ్యాప్తంగా 65లక్షలు దాటిన కరోనా కేసులు

By telugu news teamFirst Published Jun 4, 2020, 10:58 AM IST
Highlights

ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.. 

కరోనా వైరస్ మహమ్మారి మరింత వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా బుధవారం లక్షకి పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 65,67,058కి చేరాయి. అలాగే నిన్న ఆరు వేల మందికి పైగా చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 387,899కి చేరింది. అలాగే ప్రస్తుతం 30,14,906 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. వీరిలో 54201 పేషెంట్లు ఐసీయూలో ఉన్నారు.

ఇక అమెరికాలో మళ్లీ కరోనా జోరు కనిపిస్తుంది. అమెరికాలో ఓ ఐదు రోజుల నుంచి కొత్త కేసులు, మరణాల నమోదు తగ్గుతోంది. అయితే నిన్న 20 వేలకి పైగా కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 19,01,783కి చేరాయి. మొత్తం మరణాల సంఖ్య 109142కి చేరింది. ఇక ఓవరాల్‌గా చూస్తే బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

అలాగే భారత్ విషయానికి వస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. భారత్‌లో గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో భారత్‌లో 9,304 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,919కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 1,06,737.

గత 24 గంటల్లో భారత్‌లో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 260 మంది మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 6,075కు చేరింది. భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా మెరుగ్గానే ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం. ఇప్పటివరకూ భారత్‌లో 1,04,107 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఒక్క రోజులో 9వేలకు పైగా పాజిటివ్ కేసులు, 250 మందికి పైగా కరోనాతో మరణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

click me!