
కరోనా మహమ్మారి కారణంగా చైనాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చి.. రెండేళ్లుగా ఇక్కడే ఉంటున్న సంగతి తెలిసిందే. చైనా విధించిన వీసా, విమాన పరిమితుల కారణంగా వారు అక్కడికి వెళ్లలేకపోయారు. అయితే చైనాలో చదువుతున్న కొంతమంది భారతీయ విద్యార్థులను అనుమతించే ప్రణాళికపై చైనా శుక్రవారం ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ వెల్లడించారు. జావో లిజియాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చదువుల కోసం చైనాకు తిరిగి రావడంపై భారతీయ విద్యార్థుల ఆందోళనలకు తమదేశం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇతర దేశాల విద్యార్థులు చైనాకు తిరిగి వచ్చే విధానాలు, అనుభవాన్ని మేము భారత్కు తెలియజేశాం’’ అని చెప్పారు.
భారతీయ విద్యార్థులు తిరిగి చైనా రావడానికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించబడిందని ఆయన చెప్పారు. చైనాకు తిరిగి రావాల్సిన విద్యార్థుల జాబితాను భారతదేశం అందించడమే మిగిలి ఉందని తెలిపారు. ‘‘చైనాలో భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువుతున్నారని మేం అర్థం చేసుకున్నాం. పేర్లను సేకరించడానికి భారత్కు కొంత సమయం పట్టవచ్చు. ప్రస్తుత సంక్లిష్టమైన, మహమ్మారి పరిస్థితుల్లో భారతీయ విద్యార్థుల్లో కొంత మందిని అనుమతించడానికి చైనా సిద్దంగా ఉంది. చదువుల కోసం చైనాకు వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి.. మేము అంతర్జాతీయ అంటువ్యాధి పరిస్థితి, అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు, వారి ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ సూత్రం విదేశీ విద్యార్థులందరికీ సమానంగా వర్తిస్తుంది’’ అని జావో చెప్పారు.
భారతీయ విద్యార్థులను ఎప్పటి నుంచి అనుమతిస్తారనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం, ఇప్పటికే చానల్స్.. విద్యార్థులకు సౌకర్యాలు అందించడానికి పనిచేస్తాయని చెప్పారు. ఇక, చైనాకు తిరిగి వచ్చే విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి సంబంధించి చైనా భారత్కు ఏమైనా ప్రమాణాలను అందించిందా అనే ప్రశ్నకు.. ‘‘ఆ ప్రశ్నకు నా వద్ద సమాచారం లేదు. కానీ ఎంబసీతో పాటు ఇప్పటికే ఉన్న చానెల్స్ కమ్యూనికేషన్ ద్వారా ఈ వివరాలు క్రమబద్దీకరించబడతాయని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. కావున అది శుభవార్తను అందిస్తుంది’’ అని చెప్పారు.
చైనా నుంచి ప్రకటన వెలువడిన నేపథ్యంలో.. అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందించింది. చైనాకు తిరిగి రావాలని అనుకుంటున్న భారతీయ విద్యార్థుల వివరాలను కోరింది. ‘‘2022 మార్చి 25న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశం తర్వాత భారత విద్యార్థులను అనుమతించేందుకు చైనా తన సుముఖతను వ్యక్తం చేసింది. అవసరాన్ని బట్టి భారత విద్యార్థులు చైనాకు చేరుకుంటారు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి భారతీయ రాయబార కార్యాలయం అటువంటి విద్యార్థుల జాబితాను సిద్ధం చేయాలని రాయబార కార్యాలయం భావిస్తోంది. దీనిని చైనాకు వారి పరిశీలను పంపాల్సి ఉంటుంది.
కాబట్టి భారతీయ విద్యార్థులు Google ఫామ్ను పూరించడం ద్వారా అవసరమైన సమాచారాన్ని అందించాలి. https://forms.gle/MJmgByc7BrJj9MPv7 ఈ లింక్ తాజాది అని మే 8లోపు ఫామ్లో వివరాలను సబ్మిట్ చేయాలి. ఈ వివరాలు.. చైనాకు అందజేసిన తర్వాత వారు సంబంధిత విభాగాలను సంప్రదించి గుర్తించిన విద్యార్థులు కోర్సును పూర్తి చేయడానికి చైనాకు అనుమతించబడతారని సూచిస్తారు’’ అని ప్రకటన పేర్కొంది. ఈ సమన్వయ ప్రక్రియ సమయానుకూలంగా నిర్వహించబడుతుందని తెలిపింది.
మరోవైపు చైనా తిరిగి అనుమతించబడే విద్యార్థులు విద్యార్థులు COVID-19 నివారణ చర్యలకు బేషరతుగా కట్టుబడి ఉండాలని ఆ దేశం పేర్కొంది. కోవిడ్ నివారణ చర్యలకు సంబంధించిన అన్ని ఖర్చులను వారే భరించడానికి అంగీకరించాలని తెలిపింది.
ఇక, గతంలోని నివేదికల ప్రకారం.. దాదాపు 23,000 మంది భారతీయ విద్యార్థులు చైనాలో చదువుకుంటున్నారు. వారిలో ఎక్కువ మెడిసిన్ చదివేవారు ఉన్నారు. 2019 డిసెంబర్లో చైనాలో కరోనావైరస్ విజృంభించడంతో.. వారు స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే కరోనా కట్టడికి చైనా విధించిన ఆంక్షల కారణంగా వారు తిరిగి అక్కడికి వెళ్లలేకపోయారు. అప్పటి నుంచి వారిలో చాలా మంది తమ చదువుల కోసం చైనా వెళ్లాలని చూస్తున్నారు. అయితే విమానాల రద్దు, వీసాలు రద్దు చేయడంతో వారికి అవకాశం లభించలేదు. దీంతో వారు ఆన్లైన్ తరగతులకే పరిమితమయ్యారు. విద్యార్థులతో పాటు చైనాలో పనిచేస్తున్న వందలాది భారతీయుల కుటుంబాలు కూడా చైనా భారతదేశం నుంచి వీసాలు, విమానాలను రద్దు చేయడంతో స్వదేశంలోనే ఉండిపోయారు.