ఐదు వేల కిలోల బాంబు: నీటిలో పేల్చేసిన అధికారులు, వీడియో వైరల్

By Siva KodatiFirst Published Oct 14, 2020, 8:35 PM IST
Highlights

రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటికి చెందిన భారీ బాంబును అధికారులు పేల్చివేశారు. పోలాండ్‌ కాలువలో బాంబు పేల్చిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది

రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటికి చెందిన భారీ బాంబును అధికారులు పేల్చివేశారు. పోలాండ్‌ కాలువలో బాంబు పేల్చిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టాల్‌బాయ్‌ లేదా భూకంపంగా పిలిచే ఈ బాంబు దాదాపు 5వేల కిలోల ఉంటుందని అక్కడి నేవీ అధికారులు తెలిపారు.

రెండవ ప్రపంచ యుద్దం నాటి ఈ బాంబును మంగళవారం బాల్టిక్‌ సముద్రం సమీపంలోని కాలువలో నిర్వీర్యం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ క్రూయిజర్‌ లుట్జోపై దాడి చేసేందుకు బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ బాంబును పొలాండ్‌లో వదిలినట్లు సమాచారం. అప్పటి నుంచి ఈ బాంబు‌ అక్కడే ఉందని నేవీ అధికారులు తెలిపారు.

దీనిపై ఓ నేవీ అధికారి మాట్లాడుతూ.. దీనివల్ల ఎప్పటికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందనే భావించి నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో బాంబును మంగళవారం స్వీనోజ్‌సై ప్రాంతంలోని పియూస్ట్‌ కాలువలో నిర్వీర్యం చేస్తుండగా పేలినట్లు  వెల్లడించారు.

ఈ ఆపరేషన్ చేపట్టకముందే స్థానిక ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి బాంబు నిర్వీర్యం చేసే ప్రాంతానికి 2.5 కి.మీ దూరంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ బాంబు దాదాపు 5400 కిలోల బరువు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇకపై కూడా దీనివల్ల ఎలాంటి ముంపు ఉండదని ఆయన స్ఫష్టం చేశారు. 

click me!