
ప్రకృతి అందాలను వీక్షించేందుకు పడవలపై వెళ్లిన పర్యాటకులకు ఊహించని షాక్ తగిలింది. వారి విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా మారింది. జలపాతాలను అనుకుని ఉన్న కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మృతిచెందగా.. ముగ్గురు గల్లంతయ్యారు. మరో 32 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన బ్రెజిల్లోని (Brazil) మినాస్ గెరైస్ (Minas Gerais) రాష్ట్రంలో ఓ సరస్సు వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. బ్రెజిల్లోని కాపిటోలియో ప్రాంతంలోని పర్యాటక ప్రాంతమైన ఫర్నాస్ సరస్సు (Furnas Lake) చుట్టూ ఉన్న అందాలను పెద్ద ఎత్తున పర్యాటకు వస్తుంటారు. అయితే ఆగ్నేయ బ్రెజిల్లో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో.. కొండచరియలు నానిపోయి ఉన్నాయి.
అయితే శనివారం మధ్యాహ్నం కూడా పడవల్లో tourists ఫర్నాస్ సరస్సులో వివాహరిస్తున్నారు. అయితే మూడు పడవలు రాతి కొండలకు సమీపంలో ఉన్న సమయంలో అప్పటికే మొత్తబడి ఉన్న రాళ్లు కిందపడటం మొదలైంది. వారు అక్కడి నుంచి దూరం జరుగుతున్న సమయంలో ఒక పెద్ద బండ రాయి.. మూడు పడవల మీద పడిపోయింది.
ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలను.. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న మరికొందరు ప్రయాణికులు వీడియో తీశారు. ఈ షాకింగ్ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. కొండచరియలు విరిగిపడే సమయంలో కొన్ని బోట్లు.. వాటికి చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో ఆ బోట్స్ దూరంగా వచ్చేయాలని మిగిలిన వారు హెచ్చరించారు. అయితే ఈలోపే ప్రమాదం జరిగిపోయింది. దీంతో వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కానీ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. డైవ్ స్క్వాడ్, బ్రెజిలియన్ నేవీ ఆ ప్రాంతంలో గల్లంతైన వారి గురించి గాలింపు చర్యలు చేపట్టారు. తొలత 20 మంది గల్లంతైనట్టుగా అగ్నిమాపక సిబ్బంది తెలిపినప్పటికీ.. తర్వాత పలువురు వారి సొంత మార్గాల ద్వారా ఆస్పత్రుల్లో చేరడంతో ఆ సంఖ్య తగ్గింది.
శనివారం రాత్రి మినాస్ గెరైస్ అగ్నిమాపక సిబ్బంది ప్రతినిధి మాట్లాడుతూ.. మొత్తం ఏడుగురు మరణించినట్టుగా తెలిపారు. ముగ్గురు గల్లంతయ్యారని వెల్లడించారు. మరో 32 మంది గాయపడ్డారని వీరిలో తొమ్మది మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా డైవర్లు.. రాత్రిపూట రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. ఉదయం పూట వారు తిరిగి సహాయక చర్యల్లో పాల్గొననున్నారు. అయితే ఇతర రెస్క్యూ సిబ్బంది మాత్రం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలను బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కూడా తన ట్విట్టర్ ఖాతాలో రీ ట్వీట్ చేశారు. ‘దురదృష్టకర విపత్తు సంభవించిన వెంటనే బ్రెజిల్ నేవీ బాధితులను రక్షించడానికి ఘటన స్థలానికి తరలివెళ్లింది’ అని తెలిపారు.