
లిబియాలోని మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మహిళలు, చిన్నారులు సహా 60 మంది వలసదారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. లిబియాలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ప్రకారం.. ఈ నౌకలో లిబియా నగరం జ్వారా నుండి బయలుదేరిన సుమారు 86 మంది ఉన్నారు. ఇందులో కొందరు ప్రాణాలతో బయటపడ్డారు.
ఐరోపాలో మెరుగైన జీవితం గడిపేందుకు ఈ వలసదారులంతా ప్రమాదకర మార్గమైన మధ్యధరా సముద్రంలో ప్రయాణించారని అధికారులు తెలిపారు. ఇక్కడ గతంలో చాలా ప్రమాదాలు జరిగాయని, వేలాది మంది మరణించారని అధికారులు చెప్పారు. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణం వద్ద బలమైన అలలు చుట్టుముట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.
ఈ ఘటన జరిగిన సమయంలోపడవ 86 మంది వలసదారులతో వెళ్తోందని, 61 మంది వలసదారులు మునిగిపోయారని ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘మధ్య మధ్యధరా ప్రాంతం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలలో ఒకటిగా కొనసాగుతోంది’’ అని ఆ ఏజెన్సీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.
ఇటీవలి సంవత్సరాలలో ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో యుద్ధం, పేదరికం వల్ల అక్కడి నుంచి పారిపోతున్న వలసదారులకు లిబియా ప్రధాన రవాణా కేంద్రంగా ఆవిర్భవించింది. 2011లో నాటో మద్దతుతో సాగిన తిరుగుబాటుతో ఉత్తర ఆఫ్రికా దేశం అల్లకల్లోలంగా మారింది. యూరోపియన్ యూనియన్ కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న వలసదారులకు ఈ దేశం ఒక ప్రధాన లాంచింగ్ పాయింట్ గా ఉంది.