కాబూల్ లో ఉగ్రదాడి.. భారీ పేలుళ్లు..60మంది మృతి..!

By telugu news teamFirst Published Aug 27, 2021, 8:25 AM IST
Highlights

 వేలాది మంది ఉన్న ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఈ మారణహోమం సృష్టించడం గమనార్హం. దీంతో.. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. 


ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. కాబూల్  పై ఉగ్రవాదులు దాడి చేశారు. భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో దాదాపు 60మంది ప్రాణాలు కోల్పోయారు. జంట పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ రెండు పేలుళ్లు సూసైడ్ బాంబర్లుగా అధికారులు పేర్కొంటున్నారు. వేలాది మంది ఉన్న ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఈ మారణహోమం సృష్టించడం గమనార్హం. దీంతో.. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. మృతదేహాల శరీర భాగాలు.. ముక్కలు ముక్కలుగా.. చెల్లా చెదురుగా పడి ఉండటం గమనార్హం. 60మంది ప్రాణాలు కోల్పోగా.. 120 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య చూస్తుంటే.. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

పేలుడులో తమ సోల్జర్లు నలుగురు చనిపోయారని చెప్పిన యూఎస్ అధికారులు.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ దాడి చేసిందని భావిస్తున్నట్లు చెప్పారు. 2 ఆత్మాహుతి దాడులు జరగ్గా.. వారితో పాటు ఓ గన్‌‌మన్ ఉన్నట్లు తెలిపారు. ఎయిర్‌‌‌‌పోర్టు ఎంట్రెన్స్​లో అబే గేటు దగ్గర ఓ పేలుడు, బారన్ గేటు వద్ద ఓ హోటల్‌‌కు దగ్గర్లో మరో పేలుడు జరిగిందని పెంటగాన్ అధికారి జాన్ కిర్బీ చెప్పారు. ‘జనం మధ్యలో బాంబు పేలింది. చాలా మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కొందరి అవయవాలు తెగిపడ్డాయి’ అని ప్రత్యక్ష సాక్షి అదామ్ ఖాన్ చెప్పాడు. 

కాబూల్ ఎయిర్‌‌‌‌పోర్టు బయట జరిగిన దాడిపై తాలిబాన్లు స్పందించారు. అమెరికా కంట్రోల్‌‌లో ఉన్న ఏరియాలోనే ఘటన జరిగిందని ఆరోపించారు. తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. టెర్రర్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము భద్రతపై అత్యంత శ్రద్ధ చూపుతున్నామని చెప్పారు. 

కాగా.. ఈ ఉగ్రదాడికి తామే కారణమంటూ ఐఎస్ఐఎస్ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఈ పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్లు వారు ప్రకటన విడుదల చేశారు.

click me!