
Peru Road accident: రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో ప్రయాణించిన బస్సు అదుపు తప్పి ఉత్తర పెరూలోని (Peru) లిబర్టాడ్ రీజియన్ లోని లోయలో పడింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారితో సహా 20 మంది దుర్మరణం చెందగా.. మరో 30 మంది మంది గాయపడ్డారు.
కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పెరూ అధికారులు చెబుతున్నారు. తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళ్తున్న బస్సు లిబర్టాడ్ రీజియన్లో అదుపుతప్పి లోయలో పడిపోయింది. వంద మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. కాగా అధ్వాన్నమైన రోడ్లు, అతి వేగం, ప్రమాద సూచికలు లేకపోవడం, అధికారులు నిబంధనలను అమలు చేయక పోవడం వల్ల పెరూలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
గతేడాది నవంబర్లో ఉత్తర పెరువియన్ జంగిల్లో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో ఓ ప్రయాణిస్తున్న మినీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. రెండు నెలలు గడవక ముందే మరో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుప్రమాదాల నివారణకు తగుచర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.340 కిలోమీటర్ల బస్సు ప్రయాణానికి రోడ్ల అధ్వాన్న స్థితి కారణంగా 14 గంటల సమయం పట్టిందని, ఈ సమయంలోనే బస్సు ప్రమాదానికి గురైందని బాధితులు చెబుతున్నారు.