ఆస్ట్రాజెనికా, మోడెర్నా.. రెండు వేర్వేరు డోసులు తీసుకున్న జర్మనీ ఛాన్సలర్...

By AN TeluguFirst Published Jun 23, 2021, 2:23 PM IST
Highlights

కరోనా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి, టీకా కొరతను అధిగమించేందుకు రెండు వేర్వేరు డోసులను తీసుకోవచ్చా? అనే కోణంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వేర్వేరు టీకా డోసులను తీసుకుని ఆశ్చర్యపరిచారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ (66).

కరోనా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి, టీకా కొరతను అధిగమించేందుకు రెండు వేర్వేరు డోసులను తీసుకోవచ్చా? అనే కోణంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వేర్వేరు టీకా డోసులను తీసుకుని ఆశ్చర్యపరిచారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ (66).

మొదటి డోసు ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న ఆమె, రెండో డోస్ గా మోడెర్నా టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని మెర్కెల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అరవై ఏళ్లు దాటినవారు మాత్రమే ఆస్ట్రాజెనికా టీకా వేసుకోవాలని కొద్ది నెలల క్రితం జర్మనీ మార్గదర్శకాలు జారీ చేసింది. 

యువతలో  ఆస్ట్రాజెనికా టీకాతో రక్తం గడ్డకడుతున్న కేసులు నమోదు కావడంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కొద్దివారాల తరువాత ఏప్రిల్ లో మొదటి డోసు కింద ఏంజెలా మెర్కెల్ ఈ టీకా తీసుకున్నారు. తాజాగా రెండో డోసుగా మోడెర్నా టీకాను వేయించుకున్నారు. 

16 యేళ్లుగా జర్మనీని పాలిస్తోన్న ఆమె.. ఈ ఏడాది పదవి నుంచి దిగిపోనున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఆమె ఆరోగ్యం గురించి వార్తలు వచ్చాయి. నియంత్రించ లేని స్థాయిలో ఆమె వణుకుతూ కనిపించేవారు. బహిరంగ సమావేశాల్లో కూడా ఆమె ఈ సమస్యతో బాధపడుతూ ఉండేవారు. దీనికి సంబంధించి వీడియోలు పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. 

మరోపక్క జర్మనీలో నిదానంగా ప్రారంభమైన టీకా కార్యక్రమం గత కొద్దివారాలుగా వేగం పుంజుకుంది. మంగళవారం నాటికి 51శాతం మంది ప్రజలు మొదటి డోసు వేయించుకున్నారు. 

డిమాండ్ కు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలా దేశాలు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ఒకే వ్యక్తి రెండు వేర్వేరు డోసులు వేసుకోవచ్చా? అనే అంశంమీద దృష్టి పెట్టారు. అయితే ఇలా తీసుకునేవారిలో దుష్ప్రభావాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. కాకపోతే పెద్దగా ప్రమాదం ఏమీ లేదు అంటున్నారు. 

దీనిమీద కొన్ని దేవాలనుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. బలమైన రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తుందంటున్నారు. దీంతో యాంటీబాడీలు, కరోనా సోకిన కణాలను చంపే తెల్లరక్త కణాలు అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయి. ఈ విషయం మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది.

రెండు వేర్వేరు డోసులు ఇవ్వడం వల్ల కొత్త రకాలపై టీకాలు బాగానే పనిచేస్తున్నట్లు తెలుస్తుందని అంటోంది. ఇప్పటికే ఒక డోసు టీకా ఇచ్చి, కొరత వల్ల రెండో డోసు ఇవ్వలేక ఆగిపోయిన దేశాలకు ఇదొక అవకాశమనే చెప్పాలని వ్యాఖ్యానించింది. 
 

click me!