25 ఏళ్ల తరువాత తైవాన్ లో భారీ భూకంపం.. నలుగురు మృతి..

By Sairam IndurFirst Published Apr 3, 2024, 12:08 PM IST
Highlights

25 ఏళ్ల తరువాత తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం ఒక్క సారిగా ఆ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. దీని వల్ల సంభవించిన పలు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. 

తైవాన్ లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.4 గా నమోదు అయ్యింది. ఈ ప్రకంపనల వల్ల జపాన్ లోని యోనాగుని ద్వీపంలో సునామీ సంభవించి నలుగురు మృతి చెందారు. అయితే 25 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. 1999లో తైవాన్ లోని నాంటౌ కౌంటీలో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2,500 మందికి పైగా మరణించగా, 1,300 మందికి పైగా గాయపడ్డారు.

భూకంప కేంద్ర బిందువైన హువాలియన్ కౌంటీలో నలుగురు మృతి చెందినట్లు స్థానిక అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ‘రాయిటర్స్’ వార్తా సంస్థ ప్రకారం.. హువాలియన్లో రాళ్లు పడటంతో 50 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం హువాలియన్ లోని భవనాలను కూడా దెబ్బతీసింది. ఈ ప్రకంపనల వల్ల తైవాన్ అంతటా రైలు సేవలను నిలిపివేశారు. పాఠశాల తరగతులను రద్దు చేశారు.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకటించగా, తైవాన్ భూకంప పర్యవేక్షణ సంస్థ రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. ఉదయం 7.58 గంటలకు హువాలియన్ కు ఆగ్నేయంగా 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. 

కాగా.. ఈ భూకంపం వల్ల హువాలియన్ లోని ఐదంతస్తుల భవనం పాక్షికంగా మొదటి అంతస్తు కూలడంతో భవనం 45 డిగ్రీల కోణంలో వంగిపోయింది. కూలిన భవనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు తైవాన్ అంతటా రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో పాటు రాజధాని తైపీలో భవనాలపై నుంచి టైల్స్ పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నిర్మించిన నేషనల్ లెజిస్లేచర్ గోడలు, పైకప్పులకు కూడా నష్టం కలిగించిందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ఈ ప్రకంపనల వల్ల కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తైవాన్ లో భూకంపం సంభవించిన 15 నిమిషాల తర్వాత యోనాగుని ద్వీపంలో సుమారు 1 అడుగు సునామీ అలలను గుర్తించినట్లు జపాన్ అధికారులు తెలిపారు.

జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) ఒకినావా ప్రావిన్స్ తీరప్రాంత వాసులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది మరియు 3 మీటర్ల వరకు సునామీ అలలు దేశ నైరుతి తీరాన్ని చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. జేఎంఏ ప్రకారం, 26 సంవత్సరాలలో ఒకినావాలో ఇది మొదటి సునామీ హెచ్చరిక.. 1998 లో ఇషిగాకి ద్వీపానికి దక్షిణాన 7.7 భూకంపం సంభవించిన తరువాత ఇదే మొదటి భూకంపం. కాగా.. ఒకినావా, కగోషిమా ప్రాంతాల నుంచి వచ్చే అన్ని విమానాలను నిలిపివేసిన జపాన్ ఎయిర్ లైన్స్ సునామీ హెచ్చరికలు ఉన్న ప్రాంతాలకు వెళ్లే విమానాలను దారి మళ్లించింది.

click me!