
Prophet remark row: మహ్మద్ ప్రవక్తపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, మరో బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాలు భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం వివిధ దేశాలలో ఆగ్రహాన్ని చల్లార్చడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ రచ్చ అంత తొందరగా ముగిసేలా కనిపించడం లేదు. ఎందుకంటే గల్ప్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బహిరంగంగా భారత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో భారత్ ప్రోడక్టుల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాయి. ఈ వివాదానికి సంబంధించి టాప్-10 పాయింట్స్ ఇలా ఉన్నాయి..
1. ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, యుఎఇ, ఇరాన్, జోర్డాన్, ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, మాల్దీవులు, లిబియా మరియు ఇండోనేషియాతో సహా కనీసం 15 దేశాలు వివాదాస్పద వ్యాఖ్యలపై భారత్పై అధికారికంగా నిసనలు తెలుపుతున్నాయి.
2. ప్రవక్త ముహమ్మద్ను అవమానించినందుకు దేశాలు తమ ఖండనను మరియు తిరస్కరణను వ్యక్తం చేశాయి. అలాగే, భారత ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
3. మన దేశంలో బీజేపీ నాయకులు చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకువస్తున్నాయి. బీజేపీ అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దిగజార్చిందని ఆరోపించాయి.
4. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అభ్యంతరకరమైన ట్వీట్లు మరియు వ్యాఖ్యలు ఏ విధంగానూ, ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించలేదని అన్నారు. ఇవి బయటివ్యక్తుల అభిప్రాయాలని పేర్కొంది.
5. వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను సస్పెండ్ చేయడంతోపాటు నవీన్ జిందాల్ను బీజేపీ బహిష్కరించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఏదైనా ఒక వర్గాన్ని లేదా మతాన్ని అవమానించే లేదా కించపరిచే ఏ భావజాలానికైనా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకం మరియు అలాంటి వ్యక్తులను లేదా తత్వశాస్త్రాన్ని ప్రోత్సహించదు అని పేర్కొంది.
6. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) ఈ వ్యాఖ్యలను ఖండించింది. భారతదేశంలో మైనారిటీల హక్కులను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని కోరింది.
7. ఖతార్, ఇరాన్ మరియు కువైట్ ఆదివారం భారత రాయబారులను పిలిపించి తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ.. బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించాయి.
8. వివాదాస్పద వ్యాఖ్యలు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిస్తూ వివిధ దేశాలలో సోషల్ మీడియాలో ట్రెండ్ను రేకెత్తించాయి.
9. దేశవ్యాప్తంగా వరుస మతపరమైన సంఘటనల నేపథ్యంలో గత వారం టీవీ చర్చలో నూపుర్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా మీడియా చీఫ్ నవీన్ జిందాల్ ప్రవక్తపై చేసిన ట్వీట్ను ఆ తర్వాత తొలగించారు.
10. నూపుర్ శర్మ ఈ వివాదంపై స్పందిస్తూ.. ట్విట్టర్లో క్షమాపణలు పోస్ట్ చేసారు. ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదన్నారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు.