ఓ వ్యక్తి మ్యూజియంలోకి చొరబడి రూ. 40 కోట్ల విలువైన కళాఖండాలను నాశనం చేశాడు. కారణం అడిగితే అతను చెప్పిన సమాధానానికి పోలీసులు ఖంగుతిన్నారు.
అమెరికా : కొంతమంది కోపంలో ఏం చేస్తారో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. అనుకున్నది జరగకపోయినా, తాము అనుకున్నట్లుగా లేకపోయినా కొంతమందికి బాగా కోపం వస్తుంది. దీంతో వాళ్ళు చేసే హంగామా అంతా ఇంతా కాదు. చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతారు. పట్టలేని కోపంతో అన్నింటికీ ధ్వంసం చేస్తుంటారు. మరి కొంతమంది కోపంతో విలువైన వస్తువులు పాడు చేయడం లేక తమకు తాము హాని కలిగించుకోవడం వంటి పిచ్చి పనులు చేస్తుంటారు. మరికొందరు ఒకరి మీద ఉన్న కోపాన్ని వేరే వారిపై చూపించి లేని పోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. అలాంటి కోవకు చెందిన వాడే అమెరికాకు చెందిన బ్రియాన్ ఫెర్నాండేజ్.
కోపంతో చేసిన దారుణమైన పనికి ప్రస్తుతం బ్రియాన్ ఫెర్నాండేజ్ ఊచలు లెక్క పెడుతున్నాడు. అసలేం జరిగిందంటే… అమెరికాలోని 21 ఏళ్ల బ్రియాన్ ఫెర్నాండేజ్ టెక్సాస్లోని డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లోకి చొరబడి విలువైన కళాఖండాలను ధ్వంసం చేశాడు. ఆ మ్యూజియంలో ఎంతో విలువైన గొప్ప గొప్ప కళా ఖండాలు ఉంటాయి. అతను అత్యంత విలువైన అరుదైన కళాఖండాలన్నింటినీ ధ్వంసం చేశాడు. మ్యూజియంలో బ్రియాన్ ఫెర్నాండేజ్ నష్టపరిచిన కళాఖండాల విలువ సుమారు రూ. 40 కోట్లు.
దీంతో డల్లాస్ పోలీసులు బ్రియాన్ ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అయితే పోలీసులు విచారణలో భాగంగా.. అతన్ని ఎందుకిలా చేశావ్? అని ప్రశ్నించగా.. అతను చెప్పిన సమాధానం విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. తనకు గర్ల్ ఫ్రెండ్ అంటే పిచ్చి ప్రేమ అని.. ఇటీవలే తనతో గొడవ పడ్డారని బ్రియాన్ ఫెర్నాండేజ్ చెప్పుకొచ్చాడు. ఆమె అంటే పిచ్చి అని ఆమెతో గొడవపడడంతో తట్టుకోలేక ఇలా చేశాను అని చెప్పాడు. ప్రేమ-పిచ్చి ఒక్కటే అని ఈ ఘటనలోబ్రియాన్ ఫెర్నాండేజ్ మరోసారి రుజువు చేశారు. ఏదేమైతేనేం.. తన కోపమే తన శత్రువు అని.. అతని కోపం అతనికి మిగిల్చిన నష్టం జీవితకాలం కోలుకోలేనంత...
కాగా, భారత్ లోని గుజరాత్ లో ఇలాంటి ఘటనే మార్చి 20న జరిగింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో కారు సరిగ్గా నడపాలని చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఓ యువకుడు మరో వ్యక్తిని కత్తితో పొడిచాడు. ప్రస్తుతం బాధితుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు దీపక్ ఠాకోర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి దీపక్ తన స్నేహితులతో కలిసి బైక్ మీద వెడుతున్నాడు. అయితే, ఇదే సమయంలో కునాల్ షా అనే యువకుడి కారు బైక్ ను ఢీ కొట్టింది. కొంత సమయం తరువాత కునాల్, ఆయన తల్లిదండ్రులు దీపక్ ఇంటికి వెళ్లారు. టూ వీలర్ వల్ల తన కారుకు నష్టం జరిగిందని, దీపక్ ను సరిగ్గా బండి నడపాలని అతడి తల్లిదండ్రులకు సూచించారు.
దీపక్ తల్లిదండ్రులకు కునాల్, అతడి తల్లిదండ్రులు ప్రమాదం గురించి వివరిస్తుంటే.. దీపక్ అక్కడికి చేరుకున్నాడు. వీరందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. తప్పు కునాల్ దేనని ఆయనే సరిగా కారు డ్రైవ్ చేయాలని కోరాడు. దీంతో కునాల్ కు కోపం వచ్చింది. తీవ్రంగా రెచ్చిపోతూ దీపక్ ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో పాటు దుర్భాషలాడాడు. గొడవ అక్కడితో ఆగలేదు. దీంతో వెంటనే తన ఇంట్లోనుంచి వెళ్లిపోవాలని కునాల్, అతడి తల్లిదండ్రులకు దీపక్ సూచించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కునాల్ దీపక్ ను ఛాతీ కింద కత్తితో పొడిచాడు. ఆ తరువాత అక్కడి నుంచి నిందితుడు తప్పించుకొని పారిపోయాడు.
ఈ దాడితో షాక్ అయిన దీపక్ కుటుంబం వెంటనే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు అతడిని ఐసీయూలో చేర్చారు. ఈ ఘటనపై దీపక్ ఫిర్యాదు చేశాడు. దీంతో కునాల్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.