
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. తూర్పు ఓక్లహోమాలో బహిరంగ ఉత్సవంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనతో భయాందోళన చెందిన అక్కడి ప్రజలు పరుగులు తీశారు. కాల్పులు జరిపిన 26 ఏళ్ల స్కైలర్ బక్నర్ను పోలీసుల అదుపులో ఉన్నారని అధికారులు తెలిపారు. కాల్పులు జరిగిన తర్వాత నిందితుడు స్కైలర్కు అరెస్ట్ వారెంట్ చేయబడిందని.. అయితే అతడు ఆదివారం మధ్యాహ్నం ముస్కోగీ కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి వచ్చాడని ఓక్లహోమా స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (OSBI) ఒక ప్రకటనలో తెలిపింది.
తుల్సాకు ఆగ్నేయంగా 45 మైళ్లు (72 కిలోమీటర్లు) దూరంలో ఉన్న టాఫ్ట్లోని మెమోరియల్ డే ఈవెంట్లో కాల్పులు జరిగాయని OSBI తెలిపింది. గాయపడినవారు .. 9 నుంచి 56 ఏళ్ల మధ్య వయసుగలవారని పేర్కొంది. మృతిచెందిన మహిళ వయసు 39 ఏళ్లు అని తెలిపింది. గాయపడిన వారికి ప్రాణాపాయం లేదని వెల్లడించింది.
సాధారణంగా టాఫ్ట్లో కేవలం కొన్ని వందల మంది జనాభా ఉంటారు. అయితే అక్కడ జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 1,500 మంది హాజరయ్యారు. అయితే కాల్పులు చోటుచేసుకోవడానికి ముందు అక్కడ వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టుగా పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే బక్నర్ కాల్పులు జరిపాడు. దీంతో భయపడిపోయిన జనాలు.. గట్టిగా కేకలు వేశారు. అక్కడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి పరుగులు తీశారు. దీంతో అక్కడ గందగోళ పరిస్థితి నెలకొంది. అయితే కాల్పుల అనంతరం అక్కడినుంచి పారిపోయిన బక్నర్.. ఆదివారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బక్నర్ను ముస్కోగీ కౌంటీ జైలులో ఉంచారు.
ఇక, గతవారం అమెరికా టెక్సాస్లో ఉవాల్డాలో ఓ ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మొత్తం 21 మంది మృతిచెందారు. మృతుల్లో 18 మంది చిన్నారులు ఉన్నారు. వారి వయసు 4 నుంచి 11 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలో జరిగిన అత్యంత ఘోరమైన ఘటన అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగులు మరణించాడు.