జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉద్యోగికి కరోనా: తెలంగాణ సచివాలయంలో కలకలం

By telugu teamFirst Published Jun 8, 2020, 12:17 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అలాగే, తెలంగాణ సచివాలయంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. 30 మందిని హోం క్వారంటైన్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణలోని గ్రేటర్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయం ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉద్యోగులందరినీ బయటకు పంపుతున్నారు. కార్యాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు.

ఇదిలావుంటే, తెలంగాణ సచివాలయంలో కూడా కరోనా కలకలం చెలరేగింది. సచివాలయంలోని తండ్రీకొడుకులకు కరోనా వైరస్ సోకినట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. దీంతో ఆర్థిక శాఖలోని 30 మంది ఉద్యోగులను హోం క్వారంటైన్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, హైదరాబాద్ మేయరు బొంతు రామ్మోహన్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చింది. హైదరాబాదులోని అభివృధ్ధి పనులను పర్యవేక్షించడానికి లాక్ డౌన్ కాలంలోనూ ఆయన విస్తృతంగా పర్యటించారు. గత సోమవారం ఆయన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఓ హోటల్లో టీ తాగారు. ఆ తర్వాత అదే హోటల్ లో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తెలిసింది. 

దాంతో ముందు జాగ్రత్తగా రామ్మోహన్ ఈ నెల 5వ తేదీిన ఉస్మానియా వైద్య కళాశాలలో పరీక్షలు చేయించుకున్నారు. ఆదివారం వచ్చిన ఫలితాల్లో ఆయన నెగెటివ్ వచ్చింది. ఆ హోటల్లో కరోనా సోకిన వ్యక్తి పది రోజుల ముందు నుంచే విధులకు రావడం లేదని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. అపోహలను తొలగించేందుకే మేయర్ పరీక్షలు చేయించుకున్నారని చెబుతున్నారు. 

click me!