ఇలాకాక.. హారతులు, మేళతాళాలతో స్వాగతం పలుకుతారా: బాబుపై అంబటి ఫైర్

By Siva KodatiFirst Published Feb 27, 2020, 5:31 PM IST
Highlights

చంద్రబాబు విశాఖ పర్యటనను నిరసిస్తూ ప్రజలు విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆందోళన నిర్వహించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు

చంద్రబాబు విశాఖ పర్యటనను నిరసిస్తూ ప్రజలు విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆందోళన నిర్వహించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తన కాన్వాయ్‌పై చెప్పులు, కోడిగుడ్లు వేసి ప్రజలు నిరసన తెలియజేశారని అంబటి తెలిపారు.

ఇలాంటి దాడులను వైసీపీ సమర్థించదని అయితే జనం ఆ స్థాయిలో ఎందుకు ఆందోళన చేశారో గుర్తించాలని రాంబాబు సూచించారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు ఏ రకంగా ఉత్తరాంధ్ర ప్రజలను చైతన్యపరచాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని చెబుతారా అని నిలదీశారు.

చంద్రబాబు ఆయన తాబేదార్లు, సామాజిక వర్గం, టీడీపీ నేతల కోసమే ఆయన అమరావతిని అభివృద్ధి చేయాలని భావించారని అంబటి ఆరోపించారు. ఈ సంగతి రాష్ట్రంలో అందరికీ తెలుసునని.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దంటున్న టీడీపీ అధినేతని ప్రజలు ఇలాకాక ఎలా రీసివ్ చేసుకుంటారని రాంబాబు ప్రశ్నించారు.

Aslo Read:చంద్రబాబుకు షాక్: విశాఖ పర్యటనకు గంటా శ్రీనివాస రావు డుమ్మా

మేళతాళాలు, నినాదాలు, హారతులతో ఎలా స్వాగతం పలుకుతారన్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహీ అని టీడీపీ నేతలు ప్రతి సంఘటనకు పులివెందులతో ముడిపెడుతున్నారని అంబటి విమర్శించారు.

2017లో ప్రత్యేక హోదా కోరుతూ అప్పటి ప్రతిపక్షనేత వైఎస జగన్ విశాఖపట్నం వెళ్లారని ఏకంగా ఎయిర్‌పోర్ట్ రన్‌వేపైకి సివిల్ పోలీసులు వచ్చి అడ్డుకున్నారని రాంబాబు గుర్తుచేశారు.

ఆ రోజు మమ్మల్ని ఆపమని ప్రజలెవరూ రాలేదని.. కానీ ఇప్పుడు ప్రజలే చంద్రబాబును అడ్డుకున్నారని అంబటి గుర్తుచేశారు. నాడు మహిళా కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు రోజంతా రోడ్లపై తిప్పిన వ్యవహారం ప్రజాస్వామ్యం అవుతుందా అని ఆయన నిలదీశారు.

Also Read:"సెక్షన్ 151" కింద చంద్రబాబు అరెస్ట్: ఆ సెక్షన్ ఎం చెబుతుందంటే..

పోలీసులు ఎక్కడా చంద్రబాబు పర్యటనను అడ్డుకోలేదని కానీ ప్రజలే ఆయనను అడ్డుకున్నారని చెప్పారు. ఉద్రిక్త పరిస్ధితి తలెత్తుంది కాబట్టే శాంతి భద్రతల దృష్ట్యా చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారని రాంబాబు స్పష్టం చేశారు. టీడీపీ చీఫ్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు.

ఆయన కుప్పం సభలో పాల్గొన్న ఓ వ్యక్తి బాబు హయాంలో జరిగిన అవినీతిని బహిరంగంగా చెప్పారని అంబటి గుర్తుచేశారు. ప్రజలను రెచ్చగొట్టే చర్యలను విడనాడాలని బాబుకు అంబటి హితవు పలికారు.

బాబు హయాంలో మంచివాడుగా కనిపించిన డీజీపీ... జగన్ ప్రభుత్వంలో చెడ్డవాడుగా మారిపోయారా అని ఆయన నిలదీశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ మీద, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్‌పైనా దాడులు చేశారని అన్నారు. 

click me!