ఆఫీసులోనే సాక్షి పేపర్ తగులబెట్టిన టీడీపీ నేత, కలకలం

By Siva KodatiFirst Published Feb 16, 2020, 9:05 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సాక్షి పత్రికపై విరుచుకుపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఐటీ దాడుల పేరుతో టీడీపీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సాక్షి పత్రికపై విరుచుకుపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఐటీ దాడుల పేరుతో టీడీపీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మచ్చలేని తమ పార్టీ అధినేత చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తే సహించబోమని జీవీ హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు.

Also Read:ఇంటర్ పోల్ అదుపులోకి వైఎస్ జగన్, కాళ్లు పట్టుకున్నారు: బుచ్చయ్య

ఇప్పటికైనా అధికార పార్టీ కక్షసాధింపు చర్యలు మానుకోవాలని జీవీ సూచించారు. వైఎస్ జగన్‌కు చెందిన మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేస్తామన్న ఆయన.. విలేకరుల ముందే సాక్షి పేపర్‌ను తగులబెట్టారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓడినప్పటి నుంచి వైసీపీపై టీడీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని బొత్స ఆరోపించారు.

దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా తాను ఈనాడు అధినేత రామోజీరావుకు లేఖ రాశానని మంత్రి తెలిపారు. ఎన్డీఏతో కలిసి వెళ్తామని ఎవరు చెప్పారని బొత్స ప్రశ్నించారు. ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సైతం కలిసేది లేదంటున్నారని.. తాము కలుస్తామని చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు.

వైసీపీ-బీజేపీ కలిస్తే తాను బయటకు వెళ్లిపోతానని పవన్ అంటున్నారని.. నిన్ను ఎవరు కలవమన్నారు, ఎవరు వెళ్లామన్నారంటూ బొత్స సెటైర్లు వేశారు. తాను అనని మాటను ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోందని.. ఇదంతా చంద్రబాబును రక్షించేందుకేనంటూ బొత్స ఆరోపించారు.

Also Read:మార్చిలో ఏపీ శాసన మండలి రద్దు: జగన్ కు దొరికిన హామీ

యనమల రామకృష్ణుడు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌పై దాడులకు సంబంధించి ఐటీ శాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని బొత్స చెప్పారు.

యనమల పరువు నష్టం దావా వేస్తామంటున్నారు దేని కోసం..? మీ ప్రముఖ వ్యక్తి దగ్గర రూ.2 వేల కోట్లు సీజ్ చేశామని ఐటీ శాఖ చెప్పినందుకా అని సత్తిబాబు ప్రశ్నించారు.

చిన్ని విషయాలకే హడావిడి చేసే చంద్రబాబు, లోకేశ్‌లు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని బొత్స నిలదీశారు. ఐటీ దాడులు ఏ కార్పోరేట్ కార్యాలయాల్లోనో జరిగితే అది సర్వసాధారణమని కానీ అధికారి ఇంటిపై సోదాలు జరిగడం అది మామూలు విషయం కాదన్నారు. 

click me!