రాజధాని కోసం 15 ఎకరాలు... తుళ్లూరు రైతు గుండెపోటుతో మృతి

By Arun Kumar PFirst Published Jan 22, 2020, 2:21 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమంలో విషాదం చోటుచేసుకుంది. తుళ్లూరుకు చెందిన ఓ పెద్దరైతు రాజధాని  కోసం భూమిని  కోల్పోయి తీవ్ర మనస్థాపంతో మృత్యువాతపడ్డాడు. 

గుంటూరు: పూర్తిస్థాయి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ 29 గ్రామాల ప్రజలు నిరసనల బాట పట్టారు. ముఖ్యంగా అమరావతి  కోసం భూములు కోల్పోయిన రైతులు కుటుంబాలతో సహా రోడ్డుమీదకు వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు, మహిళలు రాజధాని పోరులో ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో రైతు కూడా మృత్యువాతపడ్డాడు. 

గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన  కొమ్మినేని పిచ్చయ్య(70) అమరావతి కోసం ప్రభుత్వానికి 15 ఎకరాల భూమిని ఇచ్చాడు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన, న్యాయ రాజధానులను వేరేచోటికి తరలించి కేవలం లెజిస్లేచర్ రాజధానిని మాత్రమే అమరావతిలో కొనసాగించాలన్న నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ తోటి రైతులు చేపట్టిన ఉద్యమానిని పిచ్చయ్య కూడా మద్దతుగా నిలిచాడు.  

ఈ క్రమంలో తన భూమి, పిల్లల భవిష్యత్ పై ఆందోళన చెందిన అతడు బుధవారం గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతన్ని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించేలోపే మృత్యువాతపడ్డాడు. దీంతో రాజధాని నిరసనల్లో విషాదం చోటుచేసుకుంది. 

read more  మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం

రెండురోజుల క్రితమే అమరావతి ప్రాంతంలోని వెలగపూడి గ్రామానికి చెందిన రైతు అబ్బూరి అప్పారావు(60) గుండెపోటుతో మృతిచెందాడు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన కుటుంబసభ్యులపై ఇటీవల వారిపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురవడంతో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితంలేకుండా పోయింది. అప్పారావు మృతితో అమరావతి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నారు. 

అలాగే గుంటూరు జిల్లా తుళ్లూరుకి చెందిన మరో మహిళ కూడా శనివారం గుండెపోటుతో మృతిచెందింది. పువ్వాడ వెంకాయమ్మ(67) ముప్పై రెండురోజులనుండి అమరావతి నిరసనల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో శనివారం కూడా వెంకాయమ్మ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు.

ఇప్పటికే రాజధాని కోసం అమరావతికి చెందిన పలువురు ఆత్మహత్యలు, గుండెపోటుకు గురయి మృతిచెందారు. ఇలా మరో రైతు కూడా తీవ్ర ఆందోళనకు లోనయి మృతిచెందడంతో మృతుల సంఖ్య 20కి చేరింది. 

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ సాగుతున్న నిరసనల్లో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం వెలగపూడికి చెందిన గోపాలరావు అనే వృద్దుడు అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న తన మనవడిని పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్త విని తట్టుకోలేక గుండెపోటుకు గురయి మృతిచెందాడు.  

read more  జగన్ పై మహిళా ఎమ్మెల్సీ సెటైర్లు... శాసనమండలిలో గందరగోళం

రాజధాని తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న క్రమంలో మందడంలో ఓ రైతు స్పహ తప్పిపడిపోయాడు. ఇలా అనారోగ్యంపాలయిన రైతు సాయంత్రం మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. 

తాళ్లాయపాలెంకు చెందిన కొండేపాటి సుబ్బయ్య అనే రైతు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా నిరసన దీక్షలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి ఏమి తినకపోవడంతో ఆదివారం ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తోటి రైతులు ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు.
 

click me!