
Travel Plans : ప్రస్తుతం ప్రతిఒక్కరి జీవితం యాంత్రికంగా మారింది. ఇళ్లు, పని, ఇళ్లు... ప్రతిరోజు ఇంతే... ఆదివారం ఎలా వచ్చి ఎలా వెళ్లిపోతుందో కూడా తెలియదు. ఉద్యోగులు, వ్యాపారుల నుండి దినసరి కూలీల వవరకు ప్రతిఒక్కరి పరిస్థితి ఇంతే. ఇలా నిత్యం పని పని అంటూ శారీరకంగానే కాదు మానసికంగానూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి నుండి బయటపడి కాస్త మానసిక ప్రశాంతత, ఇంకొంత ఆనందం కావాలంటే ఫ్యామిలీతో లేదంటే స్నేహితులతో విహారయాత్రకు వెళ్లాల్సిందే.
ఓ సినిమాలో రావుగోపాలరావు 'మనిసికి కూసింత కళాపోషణ వుండాల' అంటారు. ఇది ముమ్మాటికీ నిజం. మనిషి యాంత్రిక జీవితం నుండే ఈ డైలాగ్ పుట్టివుంటుంది. కాబట్టి ఎప్పుడూ గొడ్డులా కష్టపడకుండా అప్పుడప్పుడు ఇష్టమైన పనులు కూడా చేస్తుండాలి. నెలలో ఒక్కసాయినా శరీరాన్ని, మైండ్ ను రిలాక్స్ చేయాలి. ఇందుకోసం మీకు ఏది ఇష్టమైతే అది చేయండి.
ఒకవేళ మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే ఇక ప్రతినెలా ఓసారి బ్యాగ్ సర్దుకొండి... కుటుంబం, స్నేహితులతో కలిసి హాయిగా అలా తిరిగిరండి. ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలి అన్న కన్ఫ్యూజన్ వద్దు... మీరు నెలలో ఎక్కడికి వెళితే బావుంటుందో మేం చెబుతాం.
ఏ నెలలో ఎక్కడికి వెళితే బావుంటుంది :
1. జనవరి (January) :
శీతాకాలంలో చలి పీక్స్ లో వుండే నెల ఈ జనవరి. కాబట్టి ఈ సమయంలో వేడి ఎక్కువగా వుండే ప్రాంతాలకు వెళితే బావుంటుంది. అలాంటి ప్రదేశాలేమిటో చూద్దాం.
రాజస్థాన్ (Rajasthan) : ఈ రాష్ట్రం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది ఎడారి. కానీ ఇక్కడ రాచరిక వైభవానికి ప్రతీకలుగా నిలిచే అనేక నిర్మాణాలు వున్నాయి... అలాగే జైపూర్ లాంటి అందమైన పట్టణాలే కాదు గ్రామాలు కూడా వున్నాయి. ఎండాకాలంలో ఇక్కడ విపరీతమైన వేడి వుంటుంది కాబట్టి జనవరిలో ఇక్కడ ప్రయాణం సౌకర్యవంతంగా వుంటుంది.
గోకర్ణ (Gokarna) : మన పక్కరాష్ట్రం కర్ణాటకలోని అద్భుతమైన శైవ క్షేత్రం మరియు సుందరమైన బీచ్ కలిగిన ప్రాంతం. భక్తికి భక్తి, ఎంజాయ్ మెంట్ కు ఎంజాయ్ మెంట్ కావాలంటే గోకర్ణ మంచి స్పాట్. ఇక్కడ సముద్రతీరాన శివాలయం చూడటానికి అద్భుతంగా వుంటుంది.
పాండిచ్చెరి (Pondicherry) : భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో పాండిచ్చెరి ఒకటి. సుదీర్ఘ సముద్రతీర ప్రాంతాన్ని కలిగి పర్యాటకులను ఆకర్షిస్తోంది. తమిళనాడు భూభాగంలో వుండే ఈ ప్రాంతం వేడి ప్రదేశం కాబట్టి జనవరిలో పర్యటనకు అనుకూలం.
2. ఫిబ్రవరి (February) :
అరకు (Araku) : ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామం అరకు. ఎత్తైన కొండల మధ్య, పచ్చని ప్రకృతి పరుచుకున్న ఈ ప్రాంతం శీతాకాలంలో పొగమంచుతో కప్పబడి మరింత అందంగా మారుతుంది. కాబట్టి జనవరి లేదా ఫిబ్రవరిలో అరకు సందర్శిస్తే జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాన్ని పొందవచ్చు.
కేరళ (Kerala) : గాడ్స్ ఓన్ కంట్రీగా పిలిచే కేరళ ప్రకృతి రమణీయ అందాలకు ప్రసిద్ది. నీటి ప్రవాహాల్లో పడవ ప్రయాణం, పచ్చని ప్రకృతి అందాల కనువిందు, అద్భుతమైన బీచుల్లో జలకాలు... ఇలా కేరళ పర్యటన కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
కొడైకెనాల్ (Kodaikanal) : తమిళనాడులోకి కొడైకెనాల్ ప్రకృతి అందాలకు ప్రసిద్ది. ఈ హిల్ స్టేషన్ శీతాకాలంలో పొగమంచుతో మరింత అందంగా కనిపిస్తుంది. దీన్ని 'ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్' అంటారు...దీన్నిబట్టే అక్కడి ప్రకృతి ఎంత అద్భుతంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.
3. మార్చ్ (March) :
కూర్గ్ (Coorg) : కర్ణాటకలో పచ్చని అడవులు, కొండలతో నిండివున్న ప్రాంతం. ఇది కాఫీ తోటలకు ప్రసిద్ది. కొండవాలులో అందమైన కాఫీతోటలు, వాటిమధ్య నివాసాలు... చూడటానికి చాలా అందంగా వుంటాయి. ఇక్కడ ఏ కాలంలో అయినా ఉష్ణోగ్రతలు తక్కువగా వుంటాయి కాబట్టి ఎండలు ప్రారంభమయ్యే సమయంలో ఇక్కడ పర్యటన చాలా బావుంటుంది.
కూనూర్ (Coonoor) : తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని చిన్న పట్టణం. ఇక్కడ అటవీ అందాలు అద్భుతం. ట్రెకింగ్ చేయడానికి చాలా అనువైన ప్రాంతం. లేడీ కానింగ్ సీట్ నుండి డాల్ఫిన్ నోస్ వ్యూపాయింట్ వరకు ట్రెకింగ్ మంచి అనుభూతిని ఇస్తుంది.
4. ఏప్రిల్ (April) :
లదాక్, లేహ్ (ladakh, Leh) : జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని హిమాలయ కొండలమధ్య వెలిసిన ప్రశాంతమైన ప్రాంతం లదాఖ్. ప్రస్తుతం ఇది కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతోంది. ఎత్తైన కొండల మధ్య మండు వేసవిలో కూడా ఈ ప్రాంతం చల్లగా వుంటుంది. కాబట్టి వేసవిలో ఈ ప్రాంతంలో పర్యటన కొత్త అనుభూతిని ఇస్తుంది.
సిక్కిం (Sikkim) : హిమాలయాలను ఆనుకుని వున్న సిక్కిం కూడా పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రాంతం. ప్రశాంతంగా ప్రవహించే నదులు, అంతెత్తను నిలిచిన కొండలు ఎంతో అద్భుతం. ముఖ్యంగా ట్రెక్కింగ్ కు అనువైన అనేక ప్రదేశాలు సిక్కింలో వున్నాయి.డార్జిలింగ్-కాంచనగంగ ట్రెక్కింగ్ సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
5. మే (May) :
ఆగ్రా (Agra) : ప్రేమికుల గుర్తింపుగా భావించే తాజ్ మహల్ ఇక్కడే వుంది. ఆగ్రా అనగానే తాజ్ మహల్ ఒక్కటే అనుకుంటాం... కానీ అక్కడ అనేక ప్రదేశాలు వున్నాయి. ఆగ్రా కోట, అక్బర్ సమాధి,స్వామి భాగ్.రాంభాగ్, కామేశ్వర ఆలయం, జమా మసీద్ వంటివి కూడా సందర్శనీయ ప్రదేశాలే.
సిమ్లా (Shimla) : హిమాచల్ ప్రదేశ్ రాజధాని నగరం. యాపిల్ తోటలకు ఈ ప్రాంతం ప్రసిద్ది... ఇక్కడ పండే యాపిల్స్ ను సిమ్లా యాపిల్స్ అంటారు. ఇక్కడి యాపిల్ తోటలను చూసేందుకు దేశవిదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు. అలాగే అనేక పర్యాటక ప్రాంతాలు సిమ్లాలో వున్నాయి.
నైనిటాల్ (Nainital) : ఇది ఉత్తరాఖండ్ లోని ఓ నగరం. కుమావోస్ హిల్స్ మధ్యన అందమైన సరస్సులతో కూడిన ప్రాంతమిది. ఇక్కడ నైనా దేవి ఆలయం కూడా వుంది...శక్తిపీఠాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక చుట్టూ పచ్చని ప్రకృతి నడుమ వుండే నైనీ సరస్సు అందాలు మంత్రముగ్దులను చేస్తాయి.
6. జూన్ (June) :
ఊటీ (Ooty) : తమిళనాడులోని నీలగిరి జిల్లాలో గల మరో పర్యాటక ప్రాంతం ఊటీ. వాతావరణం చల్లగా వుంటుంది కాబట్టి వేసవిలో మంచి పర్యాటక ప్రాంతం. ఎక్కువమంది పర్యాటకులు మే, జూన్ లోనే ఇక్కడికి వెళుతుంటారు... మంచి విడిది కేంద్రంగా ప్రసిద్ది.
చిక్కమంగళూరు (Chikkamangaluru) : కర్ణాటకలోకి చిక్కమంగళూరు ప్రకృతి అందాలతో నిండివుంది. ఎత్తైన పశ్చిమ కొంండలు, కాఫీ తోటలు, జలపాతాలతో భూలోక స్వర్గంలా వుంటుంది. ట్రెక్కింగ్ కు కూడా అనువైన ప్రాంతాలున్నాయి.
7. జూలై (July) :
మున్నార్ (Munnar) : కేరళలోని అందమైన హిల్ స్టేషన్. దీన్ని దక్షిణ భారత జమ్మూ కాశ్మీర్ గా పిలుస్తారు. అందమైన తోటలను సందర్శించడమే కాదు క్యాంపింగ్, ట్రెక్కింగ్, బోటింగ్, పారాసైలింగ్,రాక్ క్లైంబింగ్, ఫిషింగ్ చేయవచ్చు, ఫోటోగ్రఫీని ఇష్టపడేవారు ఇక్కడి ప్రకృతిని తమ కెమెరాల్లో బంధించవచ్చు. ఇలా మున్నార్ లో అనేక సందర్శనీయ ప్రదేశాలున్నాయి.
లోనావాలా (Lonavala) : మహారాష్ట్రలోని పూణే పట్టణానికి సమీపంలోని హిల్ స్టేషన్. ఖండాలా హిల్ స్టేషన్ కూడా ఇక్కడే వుంటుంది. వర్షాకాలంలో ఇక్కడ ప్రకృతి కనువిందు చేస్తుంది. ఈ అనుభూతిని పొందేందకు జూలై, ఆగస్ట్ మాసాల్లో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వెళుతుంటారు.