ఇవాళ (జూలై 25 శనివారం) ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. పలు జిల్లాల్లో వర్షాలకు పిడుగులు తోడయ్యి ప్రమాదకరంగా మారే ఛాన్సెస్ ఉంటాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
వర్ష సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకుండా సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు హెచ్చరించారు. అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షంవల్ల కరెంటు తీగలు తెగిపడటం, ప్లెక్సీలు, హోర్డింగ్ లు కూలడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు... కాబట్టి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.