Published : Jul 02, 2026, 01:39 PM ISTUpdated : Jul 02, 2026, 02:29 PM IST
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను కాళ్లుచేతులు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
Kalvakuntla Kavitha : తెలంగాణ ఉద్యమకారుల కోసం కల్వకుంట్ల కవిత పోరాటం చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె పిలుపు మేరకు తెలంగాణ రక్షణ సేన (TRS) నాయకులు, కార్యకర్తలు ఉద్యమానికి సిద్దమయ్యారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో ఉద్యమకారులతో కలిసి టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత భూపోరాటం చేపట్టారు... ఇందుకోసం టిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కవితను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమెతో పాటు మరికొందరు టిఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
24
కాంగ్రెస్ సర్కార్ పై కవిత సీరియస్
తెలంగాణ ఉద్యమకారుల కోసం పోరాడుతున్న టిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడంపై కవిత సీరియస్ అయ్యారు. అరెస్ట్ తర్వాత బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దారుణమని... ప్రభుత్వ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని అన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని... విచక్షణారహితంగా లాఠీలతో కొడుతూ రక్తం కళ్లజూశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
34
టిఆర్ఎస్ పోరాటం దేనికోసం?
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు పలు హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక వీటిని నెరవేర్చడం లేదంటూ కవిత ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్వరాష్ట్రం కోసం ఉద్యమించినవారికి 250 గజాల ఇంటిస్థలం ఇస్తామన్న హామీ ఏమయ్యిందని కవిత ప్రశ్నిస్తున్నారు. ఈ హామీని వెంటనే నెరవేర్చాలని... ప్రతి ఉద్యమకారుడికి ఇచ్చిన మాట ప్రకారం ఇంటిస్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ లో ఆందోళన చేపట్టారు. టిఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులతో కలిసి నిరసనకు సిద్దమైన కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉద్యమకారుల రక్తం చిందడంతోనే కాంగ్రెస్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని కవిత హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు... లేదంటే ఆయన గద్దె దిగడం ఖాయమన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరులను గౌరవించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని... వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కవిత. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను టిఆర్ఎస్ గుర్తుచేస్తూనే ఉంటుందని... ఉద్యమకారుల పక్షాన పోరాటం కొనసాగుతుందని... అరెస్టులతో భయపెట్టి తమను ఆపలేరని కల్వకుంట్ల కవిత అన్నారు.
ప్రజాపాలన ముసుగులో అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే ఘోరి కడతారు pic.twitter.com/NZx3jhShby