అమెరికాకు అందుకోసమే వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

Published : Aug 24, 2026, 08:26 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన అమెరికా పర్యటనను అడ్డుకోవడంపై రియాక్ట్ అయిన సీఎం సీరియస్ కామెంట్స్ చేశారు.

PREV
15
అమెరికా పర్యటనను అడ్డుకోవడంపై రేవంత్ సీరియస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు తాను తలపెట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన వ్యక్తిగత పర్యటనను అడ్డుకున్నా తానేమీ బాధపడేవాడిని కాదు.. కానీ తెలంగాణ భవిష్యత్తు కోసం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

25
గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానం కోసమే అమెరికాకు..: రేవంత్ రెడ్డి

వచ్చే డిసెంబర్ లో తెలంగాణలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ సమ్మిట్’ లో పాల్గొనాల్సిందిగా అమెరికాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులను నేరుగా ఆహ్వానించాలని భావించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. విదేశీ పర్యటనల ద్వారా తెలంగాణకు భారీగా పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావాలనేది ప్రధాన లక్ష్యమన్నారు. తన అమెరికా పర్యటనకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ముందస్తుగానే కేంద్ర ప్రభుత్వానికి అందించి అనుమతి కోరానని తెలిపారు. అయితే కేంద్ర విదేశాంగ శాఖ రాజకీయ కారణాలు చూపిస్తూ ఈ పర్యటనకు అనుమతి నిరాకరించిందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

35
సీఎంను అడ్డుకోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పర్యటనను కుట్రపూరితంగా అడ్డుకోవడం అంటే వ్యక్తిగతంగా తనను అవమానించడం కాదు యావత్ తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం తీవ్రమైన కక్ష, వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలోని కొందరు బీజేపీ నేతలు కేంద్రాన్ని తప్పుదోవ పట్టించి ఈ పర్యటనకు అడ్డంకులు సృష్టించారని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో విదేశీ పర్యటనలను అడ్డుకోవడం ఫెడరల్ వ్యవస్థకే ముప్పు అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

45
గుజరాత్ సీఎంకు ఒక న్యాయం... కాంగ్రెస్ సీఎంకు మరొక న్యాయమా?

తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించినప్పుడు అన్ని అనుమతులిచ్చిన కేంద్ర విదేశాంగ శాఖ, తెలంగాణ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి ప్రధానిగా కాకుండా, ఇప్పటికీ గుజరాత్‌కు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘సబ్ కా సాత్ - సబ్ కా వికాస్’ అనేది కేవలం కాగితాలు, నినాదాలకే పరిమితమైందని... బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధే తప్ప ఇతర రాష్ట్రాల ప్రగతి కేంద్రానికి పట్టడం లేదని మండిపడ్డారు. తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు గుజరాత్‌కు సపోర్ట్ ఇస్తారా? లేక సొంత రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడతారా? అని ముఖ్యమంత్రి రేవంత్ నిలదీశారు.

కేంద్రం వైఖరిపై తన నిరసనను వ్యక్తం చేయడానికి సమయం ఎంచుకోవడంపై కూడా సీఎం స్పష్టత ఇచ్చారు. తాను ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడే కేంద్రం వివక్ష గురించి మాట్లాడవచ్చు, కానీ విదేశీ గడ్డపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తే తనపై ‘దేశద్రోహి’ అని ముద్ర వేసే ప్రమాదం ఉందని భావించే ఓపికపట్టానని తెలిపారు. అందుకే స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర వైఖరిని ప్రజల ముందు ఉంచుతున్నట్లు వివరించారు. ఇంగ్లాండ్ పర్యటనకు లేని రాజకీయ అడ్డంకులు అమెరికా పర్యటనకు మాత్రమే ఎందుకు వచ్చాయో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

55
పార్లమెంట్‌లో నిలదీస్తాం..: రేవంత్ రెడ్డి

తన అమెరికా పర్యటనను అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతారని తెలిపారు. బీజేపీ ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్లు విదేశీ పర్యటనలు చేయవచ్చని, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వెళ్లకూడదనే వింత నిబంధనలను కేంద్రం రుద్దాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉండవచ్చు... అయితే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాత్రం ఆరోగ్యకరమైన సత్సంబంధాలు ఉండాలని ఆయన హితవు పలికారు. కేంద్రం అనుసరిస్తున్న ఇటువంటి వైఖరి కారణంగా తెలంగాణకు రావాల్సిన పారిశ్రామిక పెట్టుబడులు చేజారిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, కేంద్రంపై తగిన రీతిలో ఒత్తిడి తెచ్చి రాష్ట్ర హక్కు సాధించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories