నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు... వారే చేయించారు: ఈటల రాజేందర్ సంచలనం

First Published Jul 22, 2021, 2:54 PM IST

హుజురాబాద్ నియోజకవర్గంతో ప్రజా దీవెన పేరిట పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్ ఇవాళ జోరు వానలోనే ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లె గ్రామం నుండి సీతంపేట కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వర్షంలోనే ప్రసంగిస్తూ తన రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కరీంనగర్: తాను వాస్తవంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు... టీఆర్ఎస్ అదిష్టానమే రాజీనామా చేయమని అడిగితే చేసానని మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని కూడా తాను విడిచిపెట్టలేదు... విడిచేలా చేశారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లను కంచాల్లో పెడతాడని ఈటల పేర్కొన్నారు.
undefined
హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రజా దీవెన యాత్ర పేరిట ఈటల పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా ఇవాళ భారీ వర్షంలోనే ఇల్లంతకుంట మండలం మర్రివానిపల్లె గ్రామం నుండి పాదయాత్రగా బయలుదేరి సీతంపేట కు చేరుకున్నారు.
undefined
ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ... 18 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపి జైళ్లో ఉన్న వ్యక్తిని తానని... మంత్రి పదవిలో వుండగా కూడా కేసుల కోసం గంటల కొద్దీ కోర్టుల దగ్గర గడిపానన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో పులిబిడ్డల్లా కొట్లాడిన వాళ్లంతా బజార్లో పడితే... తమ రక్తాన్ని కళ్ల చూసిన వారు, ఉద్యమాన్ని అవమానించిన వారు ఇప్పుడు కేసీఆర్ పక్కన ఉన్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
undefined
''నాది రాజకీయ పార్టీ, నాకు అధికారం, నాకు కుర్చే ముఖ్యమంటున్నాడు కేసీఆర్. దళితులపై ప్రేమతో కాదు.. వారి ఓట్లకోసమే పది లక్షలు ఇస్తానంటున్నాడు. ఓట్ల కోసమే దళితులకు పది లక్షలు ఇస్తానని నిన్న కేసీఆర్ బరితెగించి చెప్పాడు'' అని ఈటల మండిపడ్డారు.
undefined
''తనను ప్రశ్నించేవాడు తెలంగాణ గడ్డమీద ఉండకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. బానిసలుగా బతికేవాళ్లు కావాలట. నేను బానిసను కాదు కాబట్టే నన్ను ఓడించాలని చూస్తున్నారు. నా ముఖం అసెంబ్లీలో కనిపించొద్దట. నా ముఖమే కదా ఆనాడు ఆంధ్రా పెత్తందార్లను ఎదిరించింది. నా మొఖమే తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపింది. నా గొంతే కదా తెలంగాణ ప్రజల గోస వినిపించింది'' అని ఈటల అన్నారు.
undefined
''మీకు ఫించన్ కావాలన్నా, కొనుగోలు కేంద్రాలు కావాలన్నా, మొక్కజొన్నలు కొనాలన్నా నేను మాట్లాడితేనా కదా వచ్చాయి. మొక్కజొన్నలు 1300-1350కి అమ్ముకున్నారు రైతులు. క్వింటాలు మీద 600 చొప్పున ఎకరాన 15 వేల నష్టపోయారు. రైతు బంధు పేరిట ఐదువేలిచ్చి.. మొక్క జొన్నలకు పదిహేనువేల నష్టం చేసాడు. మంత్రిగా ఉండి కూడా ఫించన్లు, తెల్లకార్డులు ఇప్పించలేకపోయాం. మూడేళ్లుగా ఒక్కరికైనా కొత్త ఫించన్ ఇచ్చారా? ఓట్లకు ముందు 57 ఏళ్లు నిండితే ఫించన్ అన్నాడు ఏమైంది? ఇప్పుడు ఓట్లకోసం, నావాళ్ల హుజురాబాద్ లో 11 వేల మందికి కొత్త ఫించన్లు, తెల్లరేషన్ కార్డులు వస్తున్నాయి'' అని పేర్కొన్నారు.
undefined
''నా దళిత జాతికి పది లక్షలు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నాడు. హుజురాబాద్ తో పాటు రాష్ట్రమంతా ఉన్న దళితులందరికీ పదిలక్షలు ఇవ్వాలి. ఓట్లున్నదగ్గరే గొల్లకుర్మలకు గొర్రెలిస్తారు. వాళ్ల మీద ప్రేమపై మాత్రం కాదు'' అని ఈటల అన్నారు.
undefined
''ఇంత కుంభవృష్టిలో కూడా తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారు మా ఆడబిడ్డలు. రాబోయే కాలంలో కూడా ఇప్పటిలాగే ఉంటా. హుజురాబాద్ అంటే రాష్ట్రమంతా గర్వపడేలా ఉంటా. ఓటుకు పదివేలిస్తారట. తీసుకోండి. కానీప్రశ్నించే బిడ్డను, తెలంగాణలో నిఖార్సైన బిడ్డను ఆశీర్వదించండి. ఎంగిలి మెతుకుల కోసం మనం మోసపోవద్దు. పరిగె ఏరుకుంటే లాభం లేదు.. పంట పండితేనే కడుపు నిండుతుంది'' అని ప్రజలకు తెలిపారు ఈటల రాజేందర్.
undefined
click me!