Hardik Pandya : 2026 టీ20 ప్రపంచకప్లో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ విక్టరీ కొట్టింది. అలాగే, ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 6000 పరుగులు, 200 వికెట్ల మైలురాయిని అందుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా ఘనత సాధించాడు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్తో జరిగిన 2026 టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్లో 21 బంతుల్లో 30 పరుగులు చేసిన హార్దిక్, టీ20 క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 200 వికెట్లు తీసిన తొలి భారతీయ ప్లేయర్గా రికార్డు సృష్టించారు. తన ఇన్నింగ్స్లో ఆయన 3 ఫోర్లు బాదారు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఆయన అవుట్ అయినప్పటికీ, అప్పటికే ఆయన పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది.
25
6000 పరుగులు, 200 వికెట్లు: భారత్ నుంచి ఒకే ఒక్కడు హార్దిక్
హార్దిక్ పాండ్యా తన కెరీర్లో ఇప్పటివరకు 323 టీ20 మ్యాచ్లు ఆడి 279 ఇన్నింగ్స్ల్లో 6008 పరుగులు చేశారు. ఇందులో ఆయన సగటు 29.89 కాగా, స్ట్రైక్ రేట్ 144.04గా ఉంది. బౌలింగ్లోనూ రాణిస్తూ 222 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. 2013లో బరోడా తరపున మధ్యప్రదేశ్పై టీ20 అరంగేట్రం చేసిన హార్దిక్, నేడు ప్రపంచంలోని అత్యుత్తమ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లలో ఒకరిగా ఎదిగారు. అంతర్జాతీయ స్థాయిలో కిరాన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్ వంటి దిగ్గజాల సరసన ఆయన నిలిచారు.
35
శివమ్ దూబే విధ్వంసం.. హార్దిక్ మెరుపులు
ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాతో కలిసి శివమ్ దూబే అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 76 పరుగులు జోడించారు. దూబే కేవలం 31 బంతుల్లో 66 పరుగులు చేసి టీమిండియా 193/6 భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. దూబే ఇన్నింగ్స్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ (34), తిలక్ వర్మ (31) కూడా విలువైన పరుగులు జోడించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 3 వికెట్లు పడగొట్టారు.
2015లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసి హార్దిక్ వెలుగులోకి వచ్చారు. 2016లో ఆస్ట్రేలియా పర్యటనతో భారత జట్టులోకి ప్రవేశించారు. 2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా జట్టుకు టైటిల్ అందించి తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ తర్వాత 2024లో తిరిగి ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టారు. టీమిండియాకు కూడా 16 మ్యాచ్ల్లో కెప్టెన్సీ వహించగా, అందులో 10 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. ప్రస్తుతం నాయకత్వ బృందంలో లేకపోయినా, జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు.
55
సూపర్-8కు టీమిండియా.. తదుపరి పోరు దక్షిణాఫ్రికాతో
ఈ విజయంతో భారత్ గ్రూప్-Aలో వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసి అజేయంగా నిలిచింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 176/7 పరుగులకే పరిమితమై, 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా ఇప్పటికే సూపర్-8 దశకు చేరుకుంది. గ్రూప్-1లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో భారత్ తలపడనుంది. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ లో దక్షిణాఫ్రికాతో భారత్ తన మొదటి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది.