Gambhir: టీమిండియా పేలవ ప్రదర్శన, సెలక్షన్ విధానాలపై మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టడంపై ప్రశ్నలు లేవనెత్తారు.
టీమిండియా ప్రస్తుతం క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఒకప్పుడు టెస్టు క్రికెట్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. ఇప్పుడు సొంత గడ్డపై కూడా సిరీస్లు కోల్పోయే స్థితికి దిగజారింది. దక్షిణాఫ్రికా సిరీస్లోనూ ఈ బలహీనత స్పష్టంగా కనిపించింది. మొదటి టెస్టులో ఓడిన టీమిండియా, రెండో టెస్టులోనూ ఘోర ఓటమిపాలైంది. తద్వారా కివీస్తో టెస్టు సిరీస్ తర్వాత సఫారీలతో మరో వైట్వాష్ కంప్లీట్ చేసుకుంది. ఆటగాళ్ల ప్రదర్శన ఎలాగో చెత్తగా ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఓటములకు ప్రధాన కారణం కోచ్ గంభీర్ అని మాజీలు ఆరోపిస్తున్నారు.
25
గంభీర్పై మండిపడ్డ మాజీ చీఫ్ సెలెక్టర్
తాజాగా మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా ప్రదర్శనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తుది జట్టు ఎంపికలో గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలను ఆయన విమర్శించారు. రెండో టెస్టులో అక్షర్ పటేల్ను జట్టు నుంచి తప్పించడం వెనుక అసలు కారణం ఏంటని ప్రశ్నించారు. "అసలు అక్షర్ పటేల్ ఎందుకు ఆడలేదు? ఫిట్గా లేడా? లేక ఆడటానికి అర్హుడు కాదా? అన్ని ఫార్మాట్లలో ఈ ప్లేయర్ స్థిరమైన ఆటతీరును కొనసాగిస్తున్నాడు కదా.? మరి ఎందుకని అనూహ్య మార్పులు చేసి జట్టును నాశనం చేశారు." అని శ్రీకాంత్ తన యూట్యూబ్ షోలో మండిపడ్డారు.
35
ప్రతీ మ్యాచ్ ఎవరొకరు రాక..
టెస్టు జట్టు ఎంపిక, జట్టు కూర్పుని పదేపదే మార్చడం టీమిండియాకు పెద్ద సమస్యాత్మకంగా మారిందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. "ప్రతి ఒక్క మ్యాచ్కి ఎవరో ఒకరు టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇది వారికి ఓ ఛాన్స్ ఇవ్వడం అని అనుకోవచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నారో గంభీర్ తనకు నచ్చిన వివరణను చెప్పుకోవచ్చు. ఆయన ఏం చెప్పినా నాకు అభ్యంతరం లేదు. నేను పట్టించుకోను. కానీ నేను కూడా మాజీ కెప్టెన్ను, మాజీ చీఫ్ సెలెక్టర్ను. అందుకే నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుస్తోంది," అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.
శ్రీకాంత్ టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, తాత్కాలిక కెప్టెన్ రిషబ్ పంత్లపై కూడా విమర్శలు గుప్పించారు. కుల్దీప్ "ఈ పిచ్లో టర్న్ లేదని, రోడ్డులా ఉందని" చెప్పిన వ్యాఖ్యలను శ్రీకాంత్ ఖండించారు. అదే పిచ్పై దక్షిణాఫ్రికా బౌలర్లు కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్ ఎలా వికెట్లు తీయగలిగారని, మార్కో యాన్సెన్ ఎలా బౌన్సర్లు వేసి ఐదు వికెట్లు తీయగలిగాడని ఆయన ప్రశ్నించారు.
55
గంభీర్ పై చర్యలు లేవు..
కోచ్గా గంభీర్కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీ20 ఫార్మాట్ మినహా, వన్డే, టెస్టుల్లో జట్టు ప్రదర్శన ఘోరంగా పడిపోయింది. ఈ వరుస పరాజయాలు, సెలక్షన్ విధానాలు జట్టు భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారాయన్నారు. అయితే అటు బీసీసీఐ ఇప్పట్లో గంభీర్ విషయంలో నిర్ణయం తీసుకోవట్లేదని.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగుతాడని అంతర్గత వర్గాలు తెలిపాయి. అలానే టీ20 ప్రపంచకప్ తర్వాత వచ్చే ఏడాది జూన్ నెలలో కొత్త సెలెక్షన్ కమిటీ రానుందని టాక్.