అర్జున్ టెండూల్కర్ రోల్ మోడల్ సచిన్ కాదు.. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా?

Published : Apr 01, 2026, 06:39 PM IST

Arjun Tendulkar : సచిన్ టెండూల్కర్ తన తండ్రి అయినప్పటికీ, అర్జున్ టెండూల్కర్ తన ఆరాధ్య దైవంగా మరో దిగ్గజ క్రికెటర్‌ను ఎంచుకున్నారు. ఆసక్తికరమైన కారణాలను వెల్లడించిన యంగ్ ఆల్‌రౌండర్ అర్జున్ కామెంట్స్ ఇవ్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

PREV
15
తండ్రి సచిన్ కాదు.. ఆ దిగ్గజమే నా రోల్ మోడల్ : అసలు విషయం వెల్లడించిన అర్జున్ టెండూల్కర్

ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ పేరు ఒక సంచలనం. ఆయన్ని అభిమానులు క్రికెట్ దేవుడు అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు, 34,357 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. అయితే, సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మాత్రం తన తండ్రిని కాకుండా మరో భారతీయ దిగ్గజ క్రికెటర్‌ను తన ఆరాధ్య దైవంగా భావిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన మనసులోని మాటను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

25
యువరాజ్ సింగ్ అంటే ఎంతో ఇష్టం : అర్జున్

లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ ఇటీవల శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణం, తనపై ఉన్న ప్రభావాల గురించి మాట్లాడారు. సచిన్ టెండూల్కర్ కాకుండా మీ ఆదర్శప్రాయమైన ఆటగాడు ఎవరని అడిగిన ప్రశ్నకు ఆయన తడుముకోకుండా యువరాజ్ సింగ్ అని సమాధానమిచ్చారు. యువరాజ్ సింగ్ బ్యాటింగ్ శైలి అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనే తన రోల్ మోడల్ అని స్పష్టం చేశారు. యువరాజ్ బౌలింగ్ కూడా ఇష్టమేనా అని ప్రశ్నించగా.. "ఆయన స్పిన్నర్, నేను పేసర్" అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

35
ముంబై నుంచి గోవాకు ఎందుకు వెళ్లారు? అర్జున్ అన్సర్ ఏంటో తెలుసా?

అర్జున్ టెండూల్కర్ తన కెరీర్ ప్రారంభంలో ముంబై జట్టు తరఫున ఆడారు. అయితే, ముంబై జట్టులో తీవ్రమైన పోటీ ఉండటం వల్ల ఆయనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించలేదు. దీనిపై అర్జున్ స్పందిస్తూ, "ముంబై జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అక్కడ పోటీ చాలా ఎక్కువగా ఉంది. నాకు ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించలేదు. అందుకే ఆలోచించి గోవా జట్టుకు మారాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపారు. గోవాకు వెళ్లడం వల్ల తనకు అనుభవం లభించిందని, ఒక క్రికెటర్‌గా ఎదగడానికి ఆ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడిందని ఆయన వివరించారు. నిరంతరం మ్యాచ్‌లు ఆడటం ఏ ఆటగాడికైనా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

45
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి అర్జున్

గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న అర్జున్ టెండూల్కర్, ఐపీఎల్ 2026 వేలానికి ముందు ట్రేడింగ్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్‌కు మారారు. శార్దూల్ ఠాకూర్‌కు బదులుగా లక్నో జట్టు అర్జున్‌ను తీసుకుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అర్జున్ ఆకట్టుకునే ప్రదర్శన చేయనప్పటికీ, ఈ సీజన్‌లో తన సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న లక్నో సూపర్ జెయింట్స్ తొలి మ్యాచ్‌లో అర్జున్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఆల్‌రౌండర్‌గా తన బాధ్యతలను నెరవేర్చి జట్టుకు విజయాన్ని అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

55
వారసత్వ భారంతో అర్జున్ పోరాటం

సచిన్ టెండూల్కర్ వారసుడిగా అర్జున్ పై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. తన తండ్రి సాధించిన రికార్డుల నీడలో రాణించడం అర్జున్‌కు ఎప్పుడూ ఒక సవాలుగానే ఉంది. కానీ ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం తండ్రి పేరుతో కాకుండా, తన సొంత ప్రతిభతో జట్టులో స్థానం సంపాదించుకోవాలన్నదే అర్జున్ తాపత్రయం. లక్నో జట్టులో చేరడం ఆయన కెరీర్‌కు ఒక మలుపు అని విశ్లేషకులు భావిస్తున్నారు. తన ఆరాధ్య దైవం యువరాజ్ సింగ్ లాగే జట్టును ఒంటిచేత్తో గెలిపించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories