పోసాని వ్యాఖ్యలు మిస్ ఫైర్: జగన్ మీద పోరుకు పవన్ కల్యాణ్ పక్కా ప్లాన్

First Published Sep 29, 2021, 10:11 AM IST

సినీనటుడు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ప్రతికూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఉచ్చులో పోసాని కృష్ణమురళి పడినట్లు కనిపిస్తున్నారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద సినీ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna murali )తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత సంబంధాలను కూడా పైకి తెచ్చి ఆయన విరుచుకుపడ్డారు. పనిలో పనిగా రాజకీయాల పట్ల తటస్థ వైఖరి అవలంబిస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని కూడా పోసాని లాగారు. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు వైఎస్ జగన్ కు ప్రతికూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఉచ్చులో పోసాని కృష్ణమురళి పడినట్లు కనిపిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం అనేది కుల సమీకరణాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి మద్దతు ఇచ్చారు. అదే విధంగా స్వయంగా ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ (Narndra Modi) రంగంలోకి దిగారు. దీంతో కాపు, కమ్మ సామాజిక వర్గాలు ఒక్కటి కావడంతో జగన్ అప్పుడు అధికారానికి దూరమయ్యారు. తిరిగి ఆ సమీకరణాలను సాధించాలనే పక్కా ప్రణాళికతో పవన్ కల్యాణ్ ముందుకు వచ్చినట్లు కనిపిస్తున్నారు. 

గత ఎన్నికల్లో బిజెపి, జనసేన దూరం కావడంతో చంద్రబాబు (Chnadrababu) అధికారానికి దూరమయ్యారు. పవన్ కల్యాణ్ దూరం కావడం వల్ల తాము దాదాపు 30 అసెంబ్లీ స్థానాలను కోల్పోయామని టీడీపీ నాయకులే అంచనా వేసుకున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పటీకీ పెద్దగా ఫలితం సాధించలేకపోయింది. కానీ టీడీపీని అధికారానికి దూరం చేసిందనే అంచనా ఉంది. దాంతో వైఎస్ జగన్ తిరుగులేని మెజారిటీతో అధికారానికి వచ్చారు. ఈ స్థితిలో వచ్చే ఎన్నికల్లో జగన్ ను అధికారానికి దూరం చేయాలంటే ఇరు సామాజిక వర్గాల మధ్య సఖ్యత అనే భావనకు పవన్ కల్యాణ్ వచ్చినట్లు కనిపిస్తున్నారు. 

పక్కా ప్రణాళికతోనే పవన్ కల్యాణ్ (pawan Kalyana) సాయి ధరమ్ తేజ్ Sai Dharam Tej) సినిమా రిపబ్లిక్ (Republic) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను వాడుకున్నట్లు భావిస్తున్నారు. మంత్రులపై, వైసీపీ నాయకులపై విమర్శల జడివాన కురిపించారు. కాపు (kapu) సామాజిక వర్గానికే చెందిన పేర్ని నానిని పేరెత్తకుండా సన్నాసి అని సంబోధించారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారు.  

దాంతో పవన్ కల్యాణ్ మీద పేర్ని నానితో పాటు అవంతి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ కు కాస్తా ఘాటుగానే వారు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. అయితే, పోసాని కృష్ణమురళి రంగ ప్రవేశంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. విమర్శలు, ప్రతివిమర్శలు వ్యక్తిగత స్థాయికి చేరుకున్నాయి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పంపుతున్న మెసేజ్ ల ఆధారంగా పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం పెట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా పవన్ కల్యాణ్ ను తిట్టారు. చిరంజీవికి, చిరంజీవి కుటుంబానికి కూడా తగిలే విధంగా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారు.  

పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల వెనక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) ఉన్నారనే ప్రచారం ముమ్మరమైంది. జగన్ అండదండలు లేకుండా పోసాని అంత సాహసం చేయరనే మాట వినిపిస్తోంది. పోసాని వ్యాఖ్యలు జగన్ కు ఎదురు తిరుగుతాయా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. కాపు సామాజికవర్గాన్ని జగన్ కు దూరం చేయాలనే పవన్ కల్యాణ్ కొంత మేరకైనా దానివల్ల ఫలిస్తాయని అంటున్నారు. దాంతో పోసాని కృష్ణమురళి మిస్ ఫైర్ అయినట్లేనని కూడా భావిస్తున్నారు. 

పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ ఆశించిన ఫలితం దక్కిందనే భావన కలుగుతోంది. కాపు సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేయాలని ఆయన వ్యూహం ఫలించినట్లేనని అంటున్నారు. పవన్ కల్యాణ్ మీద పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై కాపు సామాజిక వర్గం తీవ్రంగా తప్పు పడుతోంది. ఈ రకంగా ఏ మాత్రమైన కాపు సామాజికవర్గం జగన్ కు దూరమై తన వైపు వస్తే ఫలితం సాధించినట్లేననే పవన్ కల్యాణ్ వ్యూహం పనిచేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham)ను కూడా టార్గెట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్లపై మాట్లాడినవారు ఇప్పుడు మౌనంగా ఉన్నారని ఆయన అన్నారు. ముద్రగడ పద్మనాభం పేరును పవన్ కల్యాణ్ ఎత్తకపోయినప్పటికీ తన ఉద్దేశం చేరాల్సినవారికి చేరుతుంది. ముద్రగడను నమ్ముకున్న కాపు సామాజిక వర్గాన్ని తన వైపు మళ్లించుకోవడంలో భాగంగానే పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. అధి ఫలితం ఇచ్చినట్లు కూడా కనిపిస్తోంది. 

అందుకు ప్రధాన ఉదాహరణ మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామ జోగయ్య (Chegondi Harirama Jogaiah) కాపు సంక్షేమ సంఘం బ్యానర్ మీద విడుదల చేసిన ప్రకటన. చేగొండ హరిరామ జోగయ్యను సామాజిక వర్గం తమ పెద్ద దిక్కుగా భావిస్తుంది. కాపు మంత్రులు పవన్ కల్యాణ్ ను తిట్టిన తిట్టు తిట్టడం వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని చెప్పుకోక తప్పదని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ ను అవమానపరచడం కాపు సమాజాన్ని అవమానపరచడమేనని ఆయన అన్ారు. ఇటువంటి నీచ చర్యల పర్యవసానం 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చవి చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 

హరిరామ జోగయ్య ప్రకటన కూడా వ్యూహాత్మకంగా వెలువడినట్లు చెప్పవచ్చు. కాపు సామాజిక వర్గానికి ఏకైక నాయకుడిగా ఆయన పవన్ కల్యాణ్ ను చూపిస్తున్నట్లు ప్రకటన ద్వారా అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ ను అవమానించడం కాపు సామజాన్ని అవమానపరచడమేనని ఆయన అనడం వెనక ఆంతర్యం అదే. ఆ రకంగా వచ్చే ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గాన్ని జగన్ కు వ్యతిరేకంగా పోలరైజ్ చేయాలనే ప్రణాళికను పవన్ కల్యాణ్ అమలు చేస్తున్నట్లు భావించవచ్చు. జగన్ దాన్ని ఎలా ఎదుర్కుంటారనే వేచి చూడాల్సిందే.  

click me!