ఇదో కొత్తరకం సైబర్ మోసం :
కోజికోడ్ ప్రాంతానికి చెందిన షాజీ కి ప్రధాన మంత్రి ముద్ర లోన్ మంజూరయ్యింది అంటూ మెసేజ్ వచ్చింది. ఇది నిజమేనని నమ్మిన అతడు ఆ మేసేజ్ లోని లింక్ ను క్లిక్ చేసాడు. ఇలా లోన్ ఆశతో సైబర్ నేరగాళ్లు పన్నిన ఉచ్చులో పడ్డాడు షాజీ.
ఇలా అతడికి డబ్బులపై వున్న ఆశనే పెట్టుబడిగా చేసుకున్నారు కేటుగాళ్లు. లింక్ ఓపెన్ చేయగానే అనుమానం రాకుండా ఓ ఫారం నింపాలని సూచించారు. షాజీ అలాగే చేసాడు. ఇందులోని అతడు పేర్కొన్న వివరాల ఆధారంగా మోసానికి పాల్పడ్డారు.
ఆన్ లైన్ లో ఫామ్ ఫిల్ చేసి సమర్పించిన తర్వాత షాజీకి కాల్ వచ్చింది. మీకు రూ.50 వేల ముద్ర లోన్ మంజూరయ్యిందని... ఈ డబ్బులు పొందాలంటే ముందుగా భీమా చేయాల్సి వుంటుందని చెప్పారు. ఇందుకోసం రూ.3,750 చెల్లించాలని కోరారు. దీంతో రూ.50,000 వస్తున్నాయన్న భ్రమలో వున్న అతడు అడిగిన డబ్బులు చెల్లించాడు. ఆ వెంటనే రూ.50,000 అకౌంట్లో పడ్డట్లు షాజీ ఫోన్ కు మెసేజ్ వచ్చింది.
అయితే డబ్బులు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు పడలేదు. ఇదే విషయాన్ని షాజీ సైబర్ నేరగాళ్లకు తెలిపాడు. దీంతో అతడు ఇంకా తమ మోసాన్ని గుర్తించలేదని ఈ కేటుగాళ్లు గ్రహించారు. ఈ క్రమంలో మరోసారి మోసం చేసి ఇంకొంత డబ్బు లాగే ప్రయత్నం చేసారు.
రూ.50,000 ఇంకా ప్రాసెసింగ్ లో వున్నాయని... మరో రూ.9000 చెల్లిస్తే మొత్తం డబ్బులు అకౌంట్లో పడేలా చూస్తామని నమ్మించే ప్రయత్నం చేసారు. కానీ అప్పటికే కొంత డబ్బు వేసిన షాజీకి ఎందుకో ఇదంతా మోసంలా అనిపించింది. తనకు ఏ లోన్ వద్దు... ఇప్పటికే చెల్లించిన రూ.3,750 తిరిగి ఇవ్వాలని అడిగాడు. తమ మోసం బైటపడటంతో సదరు సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసారు.