తెలుగు సినీ చరిత్రలో కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటాయి. అలాంటి మహోన్నత చిత్రాలలో నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 'పండంటి కాపురం' ఒకటి. 1972 జూలై 21న విడుదలైన ఈ సినిమా.. కృష్ణ నటజీవితంలో తొలి స్వర్ణోత్సవం (Golden Jubilee) జరుపుకున్న చిత్రంగా ఘనచరిత్ర సృష్టించింది.
సొంత చిత్రాల నిర్మాణంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే క్రమంలో, నటుడు డాక్టర్ ఎమ్. ప్రభాకరరెడ్డితో కలిసి కృష్ణ సమర్పణలో 'జయప్రద పిక్చర్స్' పతాకంపై జి. హనుమంతరావు పండంటి కాపురం సినిమాను నిర్మించారు. పి. లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నేటికీ ఆల్ టైమ్ క్లాసిక్గా నిలిచిపోయింది.
'పండంటి కాపురం' పేరుకు తగ్గట్టే ఒక సమిష్టి కుటుంబం, వారి మధ్య ఉండే అనురాగాలు, విధి ఆడే వింత నాటకాలు, పగ-ప్రతీకారాల చుట్టూ తిరిగే దివ్యమైన కుటుంబ కథా చిత్రం.
కథలోకి వెళ్తే... నారాయణరావు (ఎస్.వి. రంగారావు), శ్రీనివాసరావు (గుమ్మడి), మధు (ప్రభాకరరెడ్డి), రవి (కృష్ణ) నలుగురు అన్నదమ్ములు. పెద్దన్న నారాయణరావు కుటుంబానికి ప్రాణం, ఆయన మాట మిగిలిన ముగ్గురు సోదరులకు వేదవాక్కు. ఇల్లు గడవడానికి నారాయణరావే మూలస్తంభంగా ఉంటాడు. రెండో తమ్ముడు శ్రీనివాసరావు క్లర్క్గా పనిచేస్తుంటాడు. మూడో తమ్ముడు మధు కలెక్టర్ అవుతాడు. నాలుగో తమ్ముడు రవి (కృష్ణ) అల్లరి చిల్లరగా ఉంటూనే ఇంటి బాధ్యతలను నెరవేరుస్తుంటాడు.
ఈ ఆనందకరమైన పండంటి కాపురంలోకి 'రాణీ మాలినీ దేవి' (జమున) ప్రవేశంతో ఊహించని కలతలు మొదలవుతాయి. గతం లో శ్రీనివాసరావు మాలినిని ప్రేమించి, పరిస్థితుల వల్ల దూరమవుతాడు. వారికి ఒక పాప కూడా ఉంటుంది. ఆ పాప ఎక్కడుందో తెలియక, తన జీవితాన్ని నాశనం చేశాడనే పగతో కోటీశ్వరురాలైన మాలిని ఈ ఉమ్మడి కుటుంబంపై పగబడుతుంది. తన ధనబలంతో శ్రీనివాసరావు ఉద్యోగం తీయించడం, వారి ఆస్తిని దక్కించుకోవడం ద్వారా ఆ కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తుంది.
వైద్యం అందక శ్రీనివాసరావు చిన్న కుమారుడు మరణించడంతో రవి నేరుగా వెళ్లి మాలినిని నిలదీస్తాడు. ఆ తర్వాత నారాయణరావు ద్వారా తన కూతురు మరెవరో కాదు, ఆ ఇంట్లోనే పెరిగిన 'శాంతి' అని మాలిని తెలుసుకుంటుంది. తన తొందరపాటు వల్ల ఒక పండంటి కుటుంబం విచ్ఛిన్నమైందని పశ్చాత్తాపపడి, ఆస్తిని తిరిగి ఇచ్చేసి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోతుంది. చివరికి రవి, సుశీల (విజయనిర్మల)ల కళ్యాణంతో కథ సుఖాంతమవుతుంది.
కృష్ణ (రవి): యంగ్, డైనమిక్ లుక్లో కృష్ణ తన నటనతో ఆకట్టుకున్నారు. అన్నల పట్ల గౌరవం, వదినల పట్ల ఆప్యాయత, పగబట్టిన మాలినిని ధైర్యంగా ఎదుర్కొనే సన్నివేశాలలో ఆయన నటన అద్భుతం.అంతే కాదు హీరో కాబట్టి.. విజయనిర్మలతో డ్యూయెట్లు.. విలన్లతో యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో అద్భుతంగా పండాయని చెప్పవచ్చు.
ఎస్.వి. రంగారావు నారాయణరావు పాత్ర గురించి చెప్పుకుంటే.. పెద్దన్నగా ఎస్వీఆర్ జీవించేశారని చెప్పవచ్చు. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే సన్నివేశాల్లో ఆయన గంభీరమైన నటన సినిమాకు ప్రాణంపోసింది. ఇక ఈ సినిమాలో అందరు సీనియర్ నటీనటులే.. స్టార్స్ అంతా తెరపై కనిపించడం.. అప్పటి ఆడియన్స్ కు కన్నుల పండగా అనిపించింది. గుమ్మడి, ప్రభాకరరెడ్డి, జమున, దేవిక, బి. సరోజాదేవి: మహానటులందరూ తమ పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న రాణీ మాలినీ దేవి పాత్రలో జమున నటన అద్భుతం. ఇక ఈ సినిమాకు తమ కామెడీ టైమింగ్, పంచ్ లతో రాజబాబు, అల్లు రామలింగయ్యల కితకితలు పెట్టాడని చెప్పవచ్చు.
ఇంత మంది స్టార్లు.. పెద్ద పెద్ద తారలను హ్యాండిల్ చేయడం అంత ఈజీకాదు.. దర్శకుడు పి. లక్ష్మీదీపక్ ఈ భారీ తారాగణాన్ని బ్యాలెన్స్ చేస్తూ.. ఎవరిని నొప్పించకుండా.. ఎవరి పాత్రకు ఇంపార్టెన్స్ తగ్గకుండా.. సెంటిమెంట్, డ్రామా, కామెడీలను సమపాళ్ళలో మేళవించి చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ఆయన దర్వకత్వానికి.. కథకు తగ్గట్టు ఎస్.పి. కోదండపాణి అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు దశాబ్దాలు గడిచినా నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా..
“బాబూ…వినరా… అన్నాదమ్ముల కథ ఒకటి…”
“ఈ నాడు కట్టుకున్న బొమ్మరిల్లు…”
“ఇదిగో దేవుడు చేసిన బొమ్మా…”
“ఏమమ్మో జగడాల వదినమ్మో…” పాటలు ఇప్పటికి సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ పాటలకు ఘంటసాల, బాలు ప్రాణం పోశారని చెప్పవచ్చు. ఇక ఈ కుటంబ కమద్దిపట్ల సూరి రాసిన సంభాషణలు కుటుంబ భావోద్వేగాలను పండించడంలో కీలక పాత్ర పోషించాయి.
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ను ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు స్థాయికి తీసుకెళ్లడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషించింది. 1971లో వచ్చిన “దసరా బుల్లోడు” కలెక్షన్లను మించి వసూళ్లను సాధించి, ఆనాటి ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచింది. “మోసగాళ్ళకి మోసగాడు” వంటి మాస్ చిత్రం తర్వాత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి “పండంటి కాపురం”ను ఎంచుకున్నారు.
అప్పటివరకు యన్టీఆర్ 'ఉమ్మడికుటుంబం', ఏయన్నార్ 'తోడికోడళ్ళు' వంటి కుటుంబ కథా చిత్రాలు రాజ్యమేలుతున్న కాలంలో, మాస్ ఇమేజ్ ఉన్న కృష్ణ సెంటిమెంట్ కథతో వచ్చి అనూహ్య విజయాన్ని సాధించారు. ఈ సినిమా కృష్ణ నటజీవితంలో తొలి గోల్డెన్ జూబ్లీ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం తొలి విడుదలలో 25 ప్రింట్లతో ప్రారంభమై, తర్వాత 31 ప్రింట్లకు పెరిగింది. ఇది 27 కేంద్రాల్లో 100 రోజులు, 6 కేంద్రాల్లో జూబ్లీ, 3 కేంద్రాల్లో ఒక సంవత్సరం పాటు విజయవంతంగా ప్రదర్శించారు.
పండంటి కాపురం సినిమాతో 'సుజాత' అనే పేరుతో పరిచయమైన నటి, తర్వాత కాలంలో సహజనటి జయసుధగా టాలీవుడ్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. జయసుధ మాత్రమే కాదు చైల్డ్ ఆర్టిస్ట్గా 'నరేష్ కుమార్' అనే పేరుతో నరేష్ ఈ సినిమాలో నటించారు. ఆయన తర్వాత కాలంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించారు.
ఈ సినిమా కథాబలం వల్ల తమిళంలో జయశంకర్ హీరోగా 'అన్బు సహోదరగల్' పేరుతోనూ (ఇందులోనూ ఎస్వీఆర్ నటించారు), హిందీలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రాజేంద్రకుమార్తో 'సున్హేరా సన్సార్' పేరుతో రీమేక్ అయి అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించింది.
నటీనటులందరి అత్యుత్తమ నటన
గుండెలను పిండేసే కుటుంబ భావోద్వేగాలు - అనుబంధాలు
ఎస్.పి. కోదండపాణి అద్భుతమైన సంగీతం - హిట్ పాటలు
పి. లక్ష్మీదీపక్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ
నేటి తరం లెక్కల ప్రకారం కథలో కొంత పాతకాలపు సెంటిమెంట్ డ్రామా ఎక్కువగా అనిపించవచ్చు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే.. తెలుగు సినిమా చరిత్రలో 'పండంటి కాపురం' ఒక ఆణిముత్యం. సమిష్టి కుటుంబ వ్యవస్థలోని గొప్పతనాన్ని, అనుబంధాల విలువను చాటిచెప్పిన ఈ చిత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. కృష్ణ కెరీర్లో మాత్రమే కాకుండా, తెలుగు ఫ్యామిలీ డ్రామా చిత్రాలలో ఇది ఒక నభూతో న భవిష్యత్ అని చెప్పవచ్చు.