
డార్లింగ్ ప్రభాస్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు `ది రాజా సాబ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. నేడు శుక్రవారం విడుదలైన మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఫాంటసీ హర్రర్ కామెడీగా మారుతి ఈ మూవీని రూపొందించారు. సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్లు ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్గా చెప్పొచ్చు. దీనికితోడు ముగ్గురు హీరోయిన్లు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ల గ్లామర్ మరో ఎట్రాక్షన్గా నిలిచింది. ప్రభాస్ కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది. కానీ ఆ ఫన్ సినిమా మొత్తం వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్ స్లోగా, సాగదీసినట్టుగా ఉంది. ప్రభాస్ ని పెట్టుకొని హర్రర్ ఎలిమెంట్లు సరిగా డీల్ చేయకపోవడంతో అది ఆడియెన్స్ ని నిరాశ పరిచింది. ఇది వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.
`ది రాజా సాబ్` మూవీకి మొదటి రోజు కలెక్షన్లు ఎంత వస్తాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇండియన్ మూవీస్లో ప్రభాస్ చిత్రాలే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టుకున్నాయి. ఆయా చిత్రాల జాబితాలో `ది రాజా సాబ్` చేరుతుందా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక తెలుస్తోన్న సమాచారం మేరకు, పలు ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం ఈ మూవీ మొదటి రోజు వంద కోట్లు కూడా దాటే ఛాన్స్ లేదని టాక్. రూ.70 కోట్లు దాటే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ మూవీకి గురువారం అన్ని చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. కానీ టికెట్ రేట్ల హైక్, ప్రీమియర్స్ కి తెలంగాణలో అనుమతి రాలేదు. అర్థరాత్రి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో నైజాంలో ప్రీమియర్స్ పై గట్టి దెబ్బ పడిందని చెప్పొచ్చు. అది ఓవరాల్ వసూళ్లని ప్రభావితం చేస్తోంది. ఇదే ఓపెనింగ్స్ తగ్గడానికి కారణమవుతుందని చెప్పొచ్చు. దీనికితోడు కొంత నెగటివ్ టాక్ కూడా ఓపెనింగ్స్ తగ్గడానికి కారణమవుతుందట. మరి టాక్ ని దాటి ఈ మూవీ బాక్సాఫీసు వద్ద వసూళ్లని రాబడుతుందా? అనేది చూడాలి. ఇప్పటి వరకు పాన్ ఇండియా చిత్రాల్లో `బాహుబలి` మొదటి పార్ట్ కి తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. దీనికి తొలి రోజు రూ.76కోట్లు మాత్రమే వచ్చాయి. మరి `ది రాజా సాబ్` మూవీ దాన్ని దాటుతుందా అనేది చూడాలి.
ఇక ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన టాప్ 5 మూవీస్ ఏంటో చూస్తే, `బాహుబలి 2`నే టాప్లో ఉంది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.214కోట్లు వసూలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఇండియన్ మూవీ దశ దిశనే మార్చేసింది. ఇందులో ప్రభాస్తోపాటు రానా, అనుష్క, తమన్నా, నాజల్, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.
రెండో స్థానంలో `కల్కి 2898 ఏడీ` మూవీ ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. ఇందులో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొనె, దిశా పటనీ, కమల్ హాసన్, శోభన ముఖ్య పాత్రలు పోషించగా, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవీ, బ్రహ్మానందం వంటి వారు గెస్ట్ రోల్స్ చేశారు. 2024లో విడుదలైన ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.182కోట్లు రాబట్టింది.
మూడో స్థానంలో `సలార్` ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించారు. శ్రుతి హాసన్ మరో ముఖ్య పాత్ర పోషించింది. 2023లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.165కోట్లని వసూలు చేసింది.
ఆ తర్వాత `ఆదిపురుష్` ఉంది. ఓమ్ రౌత్ రూపొందించిన ఈ సినిమా మొదటి రోజు రూ.136 కోట్లు వసూలు చేసింది. రామాయణం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. కృతిసనన్ సీతగా నటించిన ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. ఈ మూవీకి నెగటివ్ టాక్ వచ్చినా ఫస్ట్ డే గట్టిగానే వసూలు చేసింది.
ప్రభాస్ నటించిన చిత్రాలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో `సాహో` కూడా ఉంది. బాక్సాఫీసు వద్ద ఇది కూడా నష్టాలను తెచ్చింది. కానీ `బాహుబలి` తర్వాత విడుదలైన మూవీ కావడంతో ఫస్ట్ డే గట్టిగానే వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ.125కోట్లని రాబట్టింది. దీనికి సుజీత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఇక మరో పాన్ ఇండియా మూవీ `బాహుబలి` పార్ట్ వన్ ఆరో స్థానంలో ఉంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రూ.73కోట్లు వసూలు చేసింది. అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల జాబితాలో చేరింది. మరి ఇప్పుడు `ది రాజా సాబ్` ఈ మూవీ ఓపెనింగ్స్ ని దాటేస్తుందా అనేది చూడాలి.