
సమంత చాలా రోజుల తర్వాత తెలుగు తెరపైకి రాబోతుంది. ఆమె మెయిన్ లీడ్గా నటించిన `యశోద` చిత్రం ఈ నెల(నవంబర్)11న విడుదల కాబోతుంది. హరి, హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందంలో ఉత్కంఠ నెలకొంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎలా అనేది దైలమాలో పడ్డారు.
సమంత చివరగా తెలుగులో `జాను` చిత్రంలో నటించింది. అది పరాజయం చెందింది. పైగా వచ్చి రెండేళ్లు అవుతుంది. మధ్యలో గతేడాది `పుష్ప`లో ఐటెమ్ సాంగ్లో మెరిసింది సమంత. మరోవైపు తమిళం చిత్రం `కాథువాకులరెండు కాదల్`తోనూ తెలుగు తెరపై అలరించింది. కానీ అవేవీ అసలైన సమంతని చూపించలేకపోయాయి. దీంతో సామ్ నటించిన సినిమా కోసం అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. `యశోద`తో ఆమె అలరించబోతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
పైగా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత నటించిన తొలి చిత్రమిది. ఆ రకంగానూ `యశోద`పై అంచనాలున్నాయి. ఈ సందర్భంగా మొదటిసారి సామ్ తెలుగు మీడియాని ప్రత్యక్షంగా ఎదుర్కోబోతుంది. ఎన్నో విషయాలపై ఆమె స్పందిస్తుందనే ఆతృతతోనూ మీడియా ఉంది. కానీ ఊహించిన విధంగా ఆమె షాక్ ఇచ్చింది. ఆమె అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అరుదైన వ్యాధితో తాను బాధపడుతున్న ఇటీవల సమంత ప్రకటించడం షాక్కి గురి చేసింది.
సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ విషయాన్ని సమంత పేర్కొంటూ షాకిచ్చింది. అభిమానలోకానికే కాదు, సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోయారు. సమంతకి వచ్చిన కష్టం గురించి వారంతా తమ ఆవేదన, బాధ, సానుభూతిని తెలియజేశారు. ధైర్యంగా ఉండాలని, పోరాడే తత్వం నీలోఉందని, నువ్వు దాన్ని ఎదుర్కొని నిలబడగలవ్ అంటూ దాదాపు చిన్న హీరో, హీరోయిన్ల నుంచి టాప్ స్టార్స్ వరకు అందరు త్వరగా కోలుకోవాలని విషెస్ తెలిపారు.
ఇంత వరకు బాగానే ఉంది, ఇప్పుడు సమంత నటించిన `యశోద` పరిస్థితేంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ సినిమా మరో పది రోజుల్లో విడుదల కానుంది. కానీ ప్రస్తుతం సమంత ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె పూర్తిగా ఎప్పుడు కోలుకుంటుంది? ఎప్పుడు బయటకు వస్తుందనేది పెద్ద సస్పెన్స్. తెలుస్తున్న సమాచారం మేరకు సమంత ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొనే అవకాశం లేదని టాక్. దీంతో ఈ చిత్రాన్ని ఎవరు ప్రమోట్ చేస్తారనేది చర్చనీయాంశం అవుతుంది. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్, సినిమా గురించి విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతుండటం విశేషం. సమంత అభిమానులే ఈ చిత్ర ప్రమోషన్ బాధ్యతలు తమపై వేసుకున్నారు. ట్రైలర్ విడుదలైన అనంతరం 24గంటల పాటు ట్రెండింగ్లో ఉండేలా చేశారు. దాన్ని అన్నిరకాల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు పెడుతూ హల్చల్ చేస్తున్నారు. దీంతో డిజిటల్ ప్రమోషన్ ఆటోమెటిక్గా జరిగిపోతుంది, ఆ విషయంలో టీమ్ వర్క్ ఈజీ అయిపోతుంది.
మరోవైపు మౌత్ టాక్ పరంగానూ ఊహించిన పబ్లిసిటీ వస్తుండటం విశేషం. తాను అనారోగ్యం బారిన పడ్డట్టు తెలిపిన పోస్ట్ సెలబ్రిటీలందరికీ రీచ్ అయ్యింది. చిరంజీవి నుంచి యంగ్ హీరోల వరకు హీరోయిన్లు సైతం ఆమెకి ధైర్యాన్ని నింపుతూ విషెస్ తెలియజేశారు. ఎన్టీఆర్ వంటి స్టార్స్ సైతం దీనిపై స్పందించి పోస్ట్ లు పెడుతుండటంతో పరోక్షంగా సమంత సినిమా `యశోద` కూడా ప్రమోట్ అవుతుంది. ఇది సినిమాపై బజ్ని క్రియేట్ చేస్తుందని ఇంటర్నెట్ టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాల్సి ఉంది.
సరోగసి నేపథ్యంలో, సరోగసి పేరుతో కొందరు చేసే అన్యాయాలపై తిరుగుబాటు నేపథ్యంలో `యశోద` చిత్రం రూపొందిందని తెలుస్తుంది. ఇందులో సమంత అద్దెగర్భాన్ని మోసే అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు.