రష్మిక మందన్నా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తుంది. స్కూల్ డేస్లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది రష్మిక మందన్నా. నిత్యం యాక్టివ్గా ఉండే తనలో కన్నీళ్లుదాగున్నాయట. రాత్రిళ్లు ఎక్కి ఎక్కి ఏడ్చేదాన్ని అంటూ షాకింగ్ విషయాలను పంచుకుంది రష్మిక. లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలపై ఓపెన్ అయ్యింది.
ఈ సందర్భంగా సినిమాల్లోకి ఎలా వచ్చావనే ప్రశ్నకి రష్మిక చెబుతూ, స్కూల్లో చదువుకునే సమయంలో తాను స్ట్రగుల్స్ ఫేస్ చేసిందట. ఫ్యామిలీకి దూరంగా హాస్టల్లో ఉండేదట. అందులో ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఉండేవారని, ఎవరూ తనతో సరిగా మాట్లాడేవారు కాదని, సరిగా ఉండేవారు కాదని చెప్పింది. తనకు కమ్యూనికేషన్ స్కిల్స్ లో చాలా వీక్ అని, దీంతో తనని అందరు అపార్థం చేసుకునే వారని చెప్పింది రష్మిక.
దీంతో రాత్రి సమయంలో ఒంటరిగా కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని అని పేర్కొంది. అయితే తనకు ఏ సమస్య వచ్చినా అమ్మకి చెప్పుకునే దాన్ని అని, ఆమె తనకు ధైర్యాన్నిచ్చేదట. ప్రపంచంలో ఇంకా ఎన్నో పెద్ద సమస్యలున్నాయి. దీని గురించి పట్టించుకోవద్దని అమ్మ చెప్పేదని, తనని అలా స్ట్రాంగ్గా మార్చిందని పేర్కొంది రష్మిక మందన్నా.
తన తొలి ఆఫర్ గురించి చెబుతూ, ఇంటర్లోనే తనకు సినిమా ఛాన్స్ వచ్చిందట. ఆ విషయంలో ఇంట్లో చెబితే వాళ్లు వద్దన్నారట. చదువుల్లో తాను చాలా వీక్ అని, సప్లిమెంటరీ పరీక్షల వల్ల డిగ్రీ కాలేజ్లో ఆలస్యంగా జాయిన్ అయినట్టు చెప్పింది. అప్పటికే జాయిన్ అయిన అందరు గ్రూపులుగా ఏర్పడ్డారట. తనని వింతగా చూసేవారని, దీంతో ఒంటరిగా సైలెంట్గా కూర్చునేదాన్ని అని చెప్పింది. ఆ సమయంలో కాలేజ్లో ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్లో పాల్గొన్నట్టు చెప్పింది. అందులో తాను ఫ్రెష్ ఫేస్ ఆఫ్ బెంగుళూరుగా నిలిచానని, తన ఫోటో పేపర్లో వచ్చిందని, దీంతో నమ్మకం పెరిగిందని చెప్పింది.
ఆ తర్వాత ముంబయిలోనూ కాంపీటీషన్లో పాల్గొని విన్నర్ అయ్యిందట. తనపై తనకు నమ్మకం వచ్చిందని, దీంతో సినిమా ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిందట రష్మిక. బెంగుళూరులో రామయ్య కాలేజ్లో చదువుకునే సమయంలోనే తాను పదికిపైగానే ఆడిషన్స్ కి వెళ్లిందట. ఓ సినిమా ఆఫర్ వచ్చిందని రెండు నెలలపాటు వర్క్ షాప్ కూడా జరిగిందని, కానీ చివరికి సినిమా తీయడం లేదని ప్రకటించారు. దీంతో చాలా డిజప్పాయింట్ అయినట్టు చెప్పింది రష్మిక.
సినిమా ఆశలు వదులుకుని చదువుపై దృష్టి పెట్టానని, ఈ క్రమంలో ఓ రోజు `కిర్రిక్ పార్టీ` టీమ్ నుంచి ఫోన్ వచ్చిందట. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలు తనని ఆడిషన్ చేశారట. ఆడిషన్లో సెలక్ట్ కాగానే చేతిలో చెక్ పెట్టారని, అది చూసి షాక్ అయినట్టు చెప్పింది రష్మిక. అప్పటి వరకు తాను బ్యాంక్కి కూడా వెళ్లలేదు. ఆ చెక్ని చూసి అమ్మకి ఫోన్ చేసి, సినిమాలో సెలక్ట్ అయ్యాను, చెక్ ఇచ్చారు, దీన్ని ఏం చేయాలని అడిగిందట. ఆ తర్వాత అమ్మ రక్షిత్, రిషబ్లను కలిసి కన్ఫమ్ చేసుకున్నాక సినిమాకి ఓకే చెప్పానని తెలిపింది. అలా తన తొలి సినిమా ఎంట్రీ జరిగిందని పేర్కొంది రష్మిక మందన్నా.
`కాంతార` ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన రక్షిత్ శెట్టి హీరోగా నటించిన `కిర్రిక్ పార్టీ` చిత్రంతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన రష్మిక ఆ తర్వాత పునీత్ రాజ్కుమార్తో `అంజనీపుత్ర`లో నటించింది. పునీత్ రాజ్కుమార్ సలహా మేరకు ఇతర భాషల వైపు చూస్తున్న సమయంలో`ఛలో` ఆఫర్ వచ్చిందట. అలా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. `గీత గోవిందం` బ్లాక్ బస్టర్తో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు `పుష్ప`తో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది రష్మిక.