
రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రధారులుగా `పిఠాపురంలో అలా మొదలైంది` అనే సినిమాలో నటించారు. దీనికి చంద్ర మహేష్ దర్శకుడు కావడం విశేషం. ఇందులో కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. శనివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన పాత్రలో నటించిన డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, `నా 49 సంవత్సరాల సినిమా జీవితంలో నాకు దొరికిన అదృష్టం ఏమిటంటే, నాకు దొరికిన మంచి పాత్రలు. ఇదే ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో దిగ్దర్శకుడు కె.విశ్వనాథ్ గారు ‘ఆ నలుగురు’ ప్రివ్యూ చూసి ‘ఈ సినిమాలో రఘురామ్ పాత్ర కాకుండా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని చూశాను. ఎక్కడా దొరకలేదు’ అని అభినందించారు. సి.నారాయణరెడ్డి గారు కూడా ఒక కంటితో నవ్విస్తూ, ఇంకో కంటితో ఏడ్పిస్తున్నావంటూ నాకు ‘నటకిరీటి’ బిరుదు ఇచ్చారు. అదంతా నా గొప్పతనం కాదు. ఆ పాత్రల తాలూకు గొప్పతనం. తీసినవారి గొప్పతనం. అలాంటి పాత్రలు దొరకడం ఆ భగవంతుడు నాకిచ్చిన వరం.
ఎవరైనా హాలీవుడ్ నటుడిని కూర్చోబెట్టి, ఇదే థియేటర్లో పొద్దున ‘లేడీస్ టైలర్’, సాయంత్రం ‘ఆ నలుగురు’ సినిమా చూపిస్తే ఆ ఆర్టిస్టు ఎవరు, ఈ ఆర్టిస్టు ఎవరు అని అడుగుతారు. ఈ అదృష్టమంతా నాకు ఆ పాత్రలవల్లే దక్కింది. చంద్ర మహేష్ ఈ కథ చెప్పినప్పుడే నా పాత్ర తాలూకు డెప్త్ ఏమిటో అర్థమైంది. ఆయన ఎన్నో కష్టనష్టాలు భరించి ఈ సినిమా తీశాడు. ప్రపంచంలో వున్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. ఎందుకంటే, ఇది అందరి ఇళ్లలో ఉండే కథ. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. మై హార్ట్ ఫెల్ట్ థాంక్స్ టు చంద్రమహేష్. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అంతటి ఎమోషన్ ఉంది. దాంతోపాటే ఈ జనరేషన్కి నచ్చే అన్ని మసాలాలూ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మూవీని చూసి ఆదరించాలని వేడుకుంటున్నా` అని అన్నారు.
గెస్ట్ గా వచ్చిన సుమన్ మాట్లాడుతూ, `చంద్ర మహేష్ క్లారిటీతో ఉండే అద్భుతమైన దర్శకుడు. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి. కొత్త కంటెంట్తో, ఫ్రెష్ సబ్జెక్ట్తో ఆయన తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను` అని అన్నారు. దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ , `పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాకి మనసుతోపాటు ప్రాణం పెట్టి పని చేశాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఈ చిత్రం గ్యారెంటీగా హిట్ అవుతుంది. ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ప్రస్తుతం ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలే నడుస్తున్నాయి. మంచి సినిమాల్ని ఆడియెన్స్ ఆదరిస్తారు. నేను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మరోస్థాయిలో ఉంటుంది’ అని అన్నారు.
నటుడు పృథ్వీ మాట్లాడుతూ, ‘మహేష్ చంద్ర గారు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’లో అద్భుతమైన కథను చూపించబోతున్నారు. తండ్రీ, కూతుళ్లు బంధాన్ని గొప్పగా రాసుకున్నారు. తల్లిదండ్రులు చెప్తే వినే పిల్లలు ఇంకా ఉన్నారు. అలాంటి కూతురు నాకు ఉండటం నా అదృష్టం. ప్రతీ కుటుంబంలో జరిగే కథ ఇది. క్లైమాక్స్కి అందరూ కచ్చితంగా కన్నీరు పెట్టుకుంటారు. మహిళా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడతారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్, అనంతగిరి, దర్శకులు రాం ప్రసాద్, సముద్ర, వీరశంకర్, బీవీఎస్ రవి, నిర్మాత చైతన్యరెడ్డి, దండిగల బాలకృష్ణ, ఆకుల సురేష్, ఎఫ్ ఎం మురళీ, నటి మణిచందన, సత్యం రాజేష్, కేదార్ శంకర, శ్రీలు, విరాట్, సన్నీ వంటి వారు పాల్గొన్నారు.