అభిమానులంతా ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బాహుబలి చిత్రంతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో నిరాశపరిచింది.
దీనితో తన అభిమానులని ఫుల్ ఖుషి చేసేందుకు ప్రభాస్ ఈ సంక్రాంతికి రాధే శ్యామ్ చిత్రంతో రాబోతున్నాడు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో రాధే శ్యామ్ ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి.
హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే ఈ చిత్ర ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. రాధాకృష్ణ దర్శకుడు.
ప్రభాస్, పూజ హెగ్డే తొలిసారి కలసి నటిస్తున్న చిత్రం ఇది. రాధే శ్యామ్ ట్రైలర్ రొమాంటిక్ గా మొదలై ఎమోషనల్ గా ముగుస్తుంది. విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమ కథ ఎలా ముగిసింది.. ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది ఈ చిత్ర కథగా అర్థం అవుతోంది.
విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమ వల్ల విపరీత పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. మొత్తంగా రాధే శ్యామ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో యువ హీరో నవీన్ పోలిశెట్టి యాంకరింగ్ తో అదరగొట్టాడు. అల్లరి చేస్తూ.. ప్రభాస్, పూజా హెగ్డే లతో ఫన్నీగా మాట్లాడుతూ నవీన్ చేసిన సందడి ఆకట్టుకుంది. ఇక మరో యాంకర్ గా రష్మీ వ్యవహరించింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ పెదనాన్న లుక్ చూశారుగా చిన్నసైజు దేవుడిలా ఉన్నారు. ఈ చిత్రం కోసం కోవిడ్ టైంలో చాలా కష్టపడ్డాం. చాలా సార్లు షూటింగ్ ఆపి మళ్ళీ మొదలు పెట్టాల్సి వచ్చింది.
ఇక పూజా హెగ్డే మాట్లాడుతూ ఈ చిత్రంలో కొత్త ప్రభాస్, కొత్త పూజా హెగ్డేలని చూస్తారు అని చెప్పింది. పూజా హెగ్డే బ్లూ శారీలో అందంగా కనిపిస్తూ ప్రీ రిలీజ్ వేడుకలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. కృష్ణం రాజు వేదికపై కాసేపు పూజా హెగ్డేతో సరదాగా ముచ్చటించారు. ఆమెతో డాన్స్ కి కృష్ణం రాజు సై అన్నారు.
ప్రీరిలీజ్ వేడుకలో ప్రభాస్, కృష్ణం రాజు ఇద్దరూ అభిమానుల చేత ట్రయిలర్ లాంచ్ చేయించారు. ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా కనిపించబోతున్నాడు.
ప్రీ రిలీజ్ వేడుకకు 'ఆదిపురుష్' డైరెక్టర్ ఓం రౌత్ అతిథిగా హాజరయ్యారు. అలాగే సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, దిల్ రాజు లాంటి వారంతా హాజరయ్యారు.
రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.