Niharika Konidela
మెగా డాటర్ నిహారిక నిర్మాతగా మారి ఇప్పటికే పలు వెబ్సిరీస్లను నిర్మించింది. ఇటీవల ఆమె సినిమా నిర్మాతగా మారింది. తన ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై `కమిటీ కుర్రాళ్లు` చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. బాల్యం నుంచి టీనేజ్, యంగర్ ఏజ్ వరకు కుర్రాళ్లలో వచ్చే మార్పులు, ఊర్లో వాళ్ల ఆటలు, కొట్లాటలు, స్ట్రగుల్స్ ని ఆవిష్కరించిన ఈ టీజర్ బాగుంది.
ఈ సందర్భంగా మీడియాతో నిహారిక ముచ్చటించింది. ఇందులో మళ్లీ రావా అనిపించే సంఘటనలు, గుర్తులు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు షాకిచ్చేలా ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నప్పుడు నిహారిక ఫిల్మ్ ఛాంబర్లో సినిమాలు చూసేదట. బయటకు పంపడం కుదరదు కాబట్టి, ఛాంబర్లోనే సినిమాలు చూసేవాళ్లమని, ఆ సమయంలో బ్రేక్లో స్నాక్స్ కోసం ఎగబడే సంఘటనలు ఎంతో బాగా ఉండేవని, అలాంటివి మళ్లీ వస్తే బాగుంటుందనిపిస్తుందని చెప్పింది నిహారిక.
ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. తాను చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి ఒక్కరే హీరో అనుకుందట. ఆయన సినిమాలు మాత్రమే చూసేదాన్ని అని, దీంతో పెదనాన్న ఒక్కరే హీరో అనుకునేదాన్ని అని చెప్పింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు హీరోలు, వాళ్లు సినిమాలు చేస్తారని తాను భావించలేదనే విషయాన్ని చెప్పకనే చెప్పింది.
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సినిమాలు చూడకపోవడం వల్ల వాళ్లు హీరోలనే విషయం తెలియదని, కానీ మెల్ల మెల్లగా రామానాయుడు స్టూడియో, ఛాంబర్లో వాళ్ల సినిమాలు కూడా చూడటం ప్రారంభించాక, ఓహో ఈ హీరోలు కూడా ఉన్నారా? అని అప్పుడు అనుకుందట. జస్ట్ ఇది నిహారిక ఫన్నీ వేలో చెప్పడం విశేషం.
ఇందులో మెగా, అల్లు వివాదంపై ఆచితూచి స్పందించింది నిహారిక. సాయిధరమ్ తేజ్.. బన్నీని అన్ ఫాలో చేయడంపై ఎదురైన ప్రశ్నకి, ఆ విషయం నాకు తెలియదని, మీరు అంటేనే తెలుస్తుందని, నిజంగానే అన్ ఫాలో చేస్తే అది వారి సొంత కారణాలు అయి ఉండొచ్చు అని తెలిపింది నిహారిక. ఈ క్రమంలో ఆమె మెగా, అల్లు వివాదం ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.
Niharika Konidela
నటిగానూ మళ్లీ బిజీ అవుతుందట నిహారిక. తమిళంలో ఓ సినిమా చేసిందట. షూటింగ్ అయిపోయిందని రిలీజ్ కావాల్సి ఉందని, తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న `వాట్ ది షిఫ్` చిత్రంలోనూ నటిస్తున్నట్టు తెలిపింది.