Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో నిర్మించబడుతున్న పాన్ ఇండియా మూవీస్. ఒక్క ప్రభాస్ పేరుపైనే ప్రస్తుతం వేల కోట్ల బిజినెస్ ఆధారపడి ఉంది. దీనితో అతడు నటించే సినిమాల విషయంలో అభిమానుల్లో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉండకూడదు. ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ నిర్మాణ విలువలతో ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తీర్చిదిద్దుతున్నాడు. రూ.500 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. టైం ట్రావెల్, ప్రపంచ యుద్ధం కాన్సెప్ట్ తో ఈ చిత్రం కథ ఉండబోతునట్లు లీకులు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రంపై ఊహించని రూమర్ వైరల్ గా మారింది.
శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం కూడా టైం ట్రావెల్ స్టోరీనే. ప్రభాస్ ప్రాజెక్ట్ కె కథ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుందని.. కాకపోతే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో రూపొందిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అయ్యాయి.
ఈ రూమర్స్ పై నాగ్ అశ్విన్ పరోక్షంగా స్పందించినప్పటికీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు నాగ్ అశ్విన్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్యారడైస్ వద్ద బస్సు దిగిన వారంతా బిర్యానీ తినరు అంటూ పోస్ట్ చేశారు. నాగ్ అశ్విన్ ఇంటెన్షన్ దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. టైం ట్రావెల్ అంశం ఎంచుకున్న వారందరి కథలు ఒకేలా ఉండవు అని పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లు అయింది.
దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. దాదాపు 8 నెలల సమయం విఎఫెక్స్ వర్క్ కోసమే వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అవెంజర్స్ తరహాలో సూపర్ హీరో చిత్రంగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతోంది అని నిర్మాత అశ్విని దత్ గతంలో తెలిపారు.
ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం 'ఆది పురుష' జనవరిలో సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ తర్వాత సలార్ మూవీ ఉంటుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రాజెక్ట్ కె కూడా వచ్చే ఏడాదే రిలీజ్. సో ప్రభాస్ అభిమానులకు 2023 బిగ్ ఇయర్ అనే చెప్పాలి.