Rajamouli
తెలుగు చిత్ర పరిశ్రమను కమర్షియల్ గా నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లిన దర్శకుడు ఎవరూ అంటే కళ్లు మూసుకుని చెప్పేయచ్చు ఆయన రాజమౌళి అని. పనిలో ఆయన పర్ఫెక్షనిస్ట్ గా ఉండే ఆయన రోజులో ఇరవై నాలుగు గంటలూ కష్టపడటానికి ఇష్టపడారు. ఈ క్రమంలో ఎలాంటి కథను తెరకెక్కించినా అది సూపర్ హిట్. సెన్సేషన్, సక్సెస్ను ఇంటి పేరుగా మార్చుకున్న రాజమౌళి సినీ ప్రయాణం గురించి ఇప్పుడు నెట్ ప్లిక్స్ ఓ డాక్యుమెంటరీ రూపంలో చెప్పబోతోంది.
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. దీని స్ట్రీమింగ్ తేదీని, ఇందులో ఏం చూపనున్నారో తెలుపుతూ తాజాగా ఆ సంస్థ (Netflix) పోస్ట్ పెట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది. ‘మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో ఇది రానున్నట్లు తెలిపింది.
Rajamouli
‘ఒక మనిషి.. అనేక బ్లాక్బస్టర్లు.. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి అంశాలతో ‘మోడ్రన్ మాస్టర్స్’ రూపొందింది. ఆగస్టు2 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది’ అని నెట్ ప్లిక్స్ సంస్థ పేర్కొంది.
ఈ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పించనున్నారు. ఈ డాక్యుమెంటరీలో పలువురు హాలీవుడ్ దర్శకులు, సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను తెలియజేయనున్నారు. తెలుగు పరిశ్రమలోని స్టార్ హీరోలు కూడా ఈ దర్శకధీరుడితో వారి అనుబంధాన్ని పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
Kalki 2898 AD
రాజమౌళి (Rajamouli) తన సక్సెస్ కు కారణం తను చిన్నప్పటినుంచి పుస్తకాల పురుగుగా ఉండటమే అంటారు. రాజమౌళి తన ఊరి గ్రంథాలయంలో ఎక్కువగా ‘అమరచిత్ర కథలు’ చదువుతూ వేరే ప్రపంచంలో విహరించేవారు. బాలభారతం, రామాయణం, బాల భాగవతం.. ఇలా ప్రతి పుస్తకాన్ని ఆయన చదివేవారు. ‘ఏదైనా పుస్తకం చదువు. లేదంటే ఆడుకో ఖాళీగా మాత్రం ఉండకు’ అని తన నానమ్మ చెప్పిన మాటలే పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచాయని చెబుతుంటారాయన.
అలాగే కథలు చదవడమే కాదు వాటిని వేరే వాళ్ళకు చెప్పటమూ నానమ్మ నుంచే నేర్చుకున్నారు రాజమౌళి. పుస్తకాల్లోని కథలకు తనదైన శైలిలో కొన్ని విశేషాలు జోడించి చెప్పటంతో రాజమౌళికి అందరూ ఫిదా అయ్యేవారు. సాధారణ కథలను భారీ తరహా కథలుగా మార్చటం అప్పుడే అలవరచుకున్నారు. రాజమౌళి ఇంటర్మీడియట్ చదివే సమయానికి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా చెన్నైలో స్థిరపడ్డారు. దాంతో జక్కన్న కూడా అక్కడికి వెళ్లారు.
ఇంటర్ పూర్తిచేశాక రాజమౌళి కొన్నాళ్లు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయన సోదరుడు ఎం. ఎం. కీరవాణికి పెళ్లైంది. ఆయన సతీమణి శ్రీవల్లి రాకతో రాజమౌళి జీవితంలో మార్పు చోటు చేసుకుంది. ‘జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నారు’ అని ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని రాజమౌళి అప్పటి నుంచే జీవితాన్ని సీరియస్గా తీసుకోవటం ప్రారంభించారు.
Mahesh Babu and Rajamouli
విజేయంద్ర ప్రసాద్ చెప్పటంతో కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్గా చేరారు. తర్వాత, విజయేంద్ర ప్రసాద్కి మంచి పేరు రావటంతో ఎక్కడో పనిచేయటం ఎందుకని ఆయన దగ్గరే అసిస్టెంట్గా చేరారు. ప్రతి సన్నివేశం పూర్తవగానే ‘నేనైతే ఇంకా బాగా తీసేవాడిని’ అని జక్కన్న అనుకుంటుండేవారు. ఆ ఆలోచనే ఆయనలోని దర్శకుడిని బయటకు తీసింది.
Mahesh Babu and Rajamouli
హైదరాబాద్కు వచ్చి గుణ్ణం గంగరాజు ఇంట్లో కొన్నాళ్లు ఉన్నారు. ఇక్కడ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో కలిసి తిరిగేవారు. ఆ తర్వాత వారిద్దరు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర పనిలో చేరారు. వీరితోపాటు ‘నా అల్లుడు’ డైరెక్టర్ ముళ్లపూడి వర రాఘవేంద్రరావు దగ్గర సహాయకుడిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వానికి ప్రకటనలు చేసేందుకు దర్శకేంద్రుడికి నచ్చేలా కాన్సెప్ట్ తయారు చేస్తే ఒక ప్రకటనకు రూ. 5000 ఇచ్చేవారు. అదే రాజమౌళి తొలి సంపాదన.
ఆ తర్వాత ‘శాంతి నివాసం’ సీరియల్కి పనిచేసే అవకాశం వచ్చింది. ముళ్లపూడి వర, రాజమౌళిలతో రాఘవేంద్రరావు ఆ ధారావాహిక మొదలుపెట్టారు. జక్కన్న సన్నివేశాన్ని వివరించి, దాని కోసం పనిచేసే తీరు దర్శకేంద్రుడికి బాగా నచ్చింది. ‘శాంతి నివాసం’ సమయంలో రాజమౌళి ఏడాదిన్నరపాటు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడేవారు.
సీరియల్ పూర్తయిన ఏడాదికి రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం. 1’ సినిమా వచ్చింది. ఆ సినిమానూ ముళ్లపూడి వర, రాజమౌళి కలిసి చేయాల్సింది. కానీ, ఇద్దరూ చేస్తే సినిమాపై ప్రభావం పడుతుందనే అభిప్రాయంతో వర ఆ ప్రాజెక్టును వదిలేశారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రాజమౌళి మెగాఫోన్ పట్టిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
తదుపరి ‘సింహాద్రి’ అనే ఓ పవర్ఫుల్ కథని తెరకెక్కించి, తానేంటో నిరూపించుకున్నారు రాజమౌళి. ఆ తర్వాత ‘సై’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లతో రాజమౌళి ఎంతటి సంచలనం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. రాజమౌళి ప్రస్తుతం మహేశ్బాబుతో ఓ భారీ ప్రాజెక్టు ఖరారు చేశారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథతో యాక్షన్ అడ్వెంచర్గా రూపొందించనున్నారు.
రాజమౌళి ప్రస్తుతం మహేశ్బాబుతో తీయనున్న ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గా, హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్వర్త్ కీలకపాత్ర పోషించనున్నారని కూడా జోరుగా ప్రచారమవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
ఈ సినిమాలో మహేశ్తో పాటు ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటిస్తుండగా, హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హెమ్స్వర్త్ కీలకపాత్ర పోషించనున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారమవుతోంది. లుక్ టెస్ట్ కోసం ఇప్పటికే లండన్ వెళ్లి వచ్చిన మూవీ టీమ్ ఇప్పుడు స్క్పిప్టింగ్ వర్క్లో నిమగ్నమైనట్లు సమాచారం. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఓ అడ్వెంచరస్ స్టోరీ ఇది అని తెలుస్తోంది. మహేశ్ కూడా తన లుక్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. జుట్టు, గడ్డంతో పాటు బాడీ బిల్డప్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.