
ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఆ జోనర్ లో తెరకెక్కిన చిత్రమే ‘మిస్టీరియస్’. సస్పెన్స్, థ్రిల్లర్ స్టోరీతో వస్తుందని ప్రమోషనల్ కంటెంట్తో తెలిసిపోయింది. దీంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్కు బ్రహ్మానందం రావడంతో ఈ సినిమాపై ఆడియన్స్లో ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ చిత్రం నేడు డిసెంబర్ 19 శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
మిస్టరీగా సాగే థ్రిల్లర్ మూవీ ఇది. కొండపూర్ ఎస్ఐ రాంఖీ (అబిద్ భూషణ్) చాలా రోజులుగా కనిపించకుండా పోతాడు. ఆ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ACP ఆనంద్ సాయి (బలరాజ్ వాడి) రంగంలోకి దిగుతాడు. రాంఖీ ఫోన్ ద్వారా విచారించగా ఆర్కిటెక్చర్ విరాట్ (రోహిత్ సాహ్ని) ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. విరాట్ భార్య శిల్ప (మేఘన రాజ్పుత్) ను విచారించగా, విరాట్ గోవా వెళ్లినట్టు చెబుతుంది. రాంఖీ తనకు ఫ్రెండ్ అనే విషయాన్ని కూడా వెల్లడిస్తుంది. కట్ చేస్తే కాసేపట్లోనే విరాట్, శిల్ప ప్రయాణిస్తున్న కార్ యాక్సిడెంట్కి గురవుతుంది. అది పోలీసులకు షాక్ ఇస్తుంది. అనంతరం విరాట్, శిల్పాలను పోలీసులు విచారిస్తారు. ఈ క్రమంలో పలు షాకింగ్ విషయాలు రివీల్ అవుతాయి. మరి రాంఖీ మిస్సింగ్ కేసుకు విరాట్, శిల్ప లకు సంబంధం ఏంటి? విరాట్ కొన్న విల్లాకు రాంఖీ ఎందుకు వెళ్లాడు? ఈ కథలోకి మిస్సిరా (రియా కపూర్) ఎందుకు వచ్చింది? అసలు SI రాంఖీని ఎవరు చంపారు? అనే మిగిలిన కథ.
గతంలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు చాలా వచ్చాయి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్, హర్రర్ ఎలిమెంట్స్ జోడిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన దర్శకుడికి వచ్చింది. అలా వచ్చిన ఆలోచనతోనే ఈ చిత్ర కథ రాసుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి.. డైరెక్టర్ పాత్రల పరిచయం విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా… డైరెక్ట్ గా మెయిన్ ప్లాట్కి వెళ్లిపోయాడు. ఇటు కథను రన్ చేస్తూనే.. పాత్రలను పరిచయం చేస్తూ.. వెను వెంటనే ట్విస్ట్లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాను చూసే ఆడియన్కు అసలు కిల్లర్ ఎవరు అనే క్వశ్చన్ మార్క్ క్లైమాక్స్ వరకు అలాగే ఉంటుంది. అయితే ఇంటర్వెల్ వరకు ఆడియన్స్ కి ఈ కథలో అంతగా ఎంగేజింగ్ అనిపించే అంశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఇంటర్వెల్లో కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చి.. కథను నెక్ట్స్ లెవెల్కు తీసుకుళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే సినిమాలో వచ్చే ట్విస్ట్లు సస్పెన్స్, థ్రిల్లర్ను ఫీల్ అయ్యే ఆడియన్స్కు సెకండాఫ్లో ఉండే హర్రర్ ఎలిమెంట్స్ ఇంకాస్త ఇంటెన్స్ క్రియేట్ అయ్యాలా చేసింది. ఇక క్లైమాక్స్లో వచ్చే ఓ బిగ్ ట్విస్ట్… సినిమాను మలుపుతిప్పుతుంది. అప్పటి వరకు కిల్లర్ వీరే అని అనుకునే ఆడియన్స్ కూడా షాక్ అవుతారు.
సినిమాలో మూడు పాటలు పెట్టారు డైరెక్టర్. ఆ మూడు పాటలు కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. అయితే, కథ వరకు అంతా బానే ఉన్నా.. నటీనటుల విషయంలో డైరెక్టర్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత బాగుండేది. అంటే.. ఇప్పుడున్న నటీనటులు అంత తెలిసిన ఫేసులు కాకపోవడం ఓ మైనస్ అని చెప్పొచ్చు. చిన్న పాయింట్ కథ కథ మొత్తం నడిపించడంతో కొంత సాగదీత తప్పలేదు. సినిమాలో వచ్చే పెద్ద ట్విస్ట్ ల వరకు ఆడియన్స్ ఎంగేజ్ కావడం కష్టంగా మారింది. రెగ్యులర్ గా సస్పెన్స్ సినిమాలు చూసే వారికి కథ అర్థమైపోతుంది. అది కూడా మైనస్ అనే చెప్పాలి.
నటీనటుల విషయానికి వస్తే.. దాదాపు అందరూ బాగా చేశారు. మెయిన్ లీడ్లో కనిపించిన రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్పుత్, అబిద్ భూషణ్ మంచి నటన కనబరిచారు. సీనియర్ పోలీస్గా కనిపించిన బలరాజ్ వాడి తన మార్క్ నటన చూపించాడు. అలాగే జబర్దస్త్ ఫేం రాజమౌళి కి మంచి పాత్ర వచ్చింది. బాగా నటించాడు కూడా ఆయన. అలాగే మరో జబర్దస్త్ ఆర్టిస్ట్ గడ్డం నవీన్ చిన్న పాత్ర చేసినా.. తన పరిధిలో బాగానే చేశాడు.
ఇక మ్యూజిక్ ML రాజా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సరైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫర్గా చేసిన పరవస్తు దేవేంద్ర సూరికి మంచి మార్కులు వేయొచ్చు. అయితే.. ఇదే సూరి ఎడిటర్గా కూడా ఈ మూవీకి వర్క్ చేశాడు. ఈ ఎడిటింగ్ విషయంలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు బాగా కుదిరాయి. దర్శకుడు మహి కోమటి రెడ్డి ఫస్ట్ హాఫ్ కథని ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది.
థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారు ఎక్కువ అంచనాలు లేకుండా ఒకసారి చూడవచ్చు.
రేటింగ్: 2.5/5