మంచు మనోజ్(Manchu Manoj) మొదటి భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నా ఒంటరిగానే ఉంటున్న విసయం తెలిసిందే. 2015లో వీరి వివాహం జరగ్గా 2019లో విడిపోయారు. అయితే ఇటీవల మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డితో సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య గణేష్ ఉత్సవాల్లో ఆయన మండపానికి భూమా మౌనికారెడ్డితో కలిసి వచ్చి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ రోజు నుంచే రెండో పెళ్లి ప్రచారం ఊపందుకుంది.
ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై మంచు మనోజ్ స్పందించారు. శుక్రవారం ఆయన దర్గాని సందర్శించారు. దర్గా ప్రార్థనల్లో పాల్గొని అల్లా ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొత్త జీవితంపై స్పందించారు మనోజ్. త్వరలో కొత్త సినిమాలు స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిపారు. అలాగే కొత్త జీవితం కూడా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే మళ్లీ ఫ్యామిలీతో కలిసి దర్గాకి వస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు మంచు మనోజ్.
డైరెక్ట్ గా ఆయన భూమా మౌనికా రెడ్డి(Bhuma Mounika Reddy)ని వివాహం చేసుకోబోతున్నట్టు చెప్పలేదుగానీ, కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నట్టు చెప్పి సెకండ్ మ్యారేజ్(Manchu Manoj Second Marriage)పై హింట్ ఇచ్చాడు. చాలా రోజులుగా ఆయన మౌనికా రెడ్డితో కలిసే ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నా అని చెప్పడంతో త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని ఆయన కన్ఫమ్ చేశారు. మరి ఆ పెళ్లి ఎప్పుడనేది ఇప్పుడు మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
మంచు మోహన్బాబు, భూమా నాగిరెడ్డి ఫ్యామిలీల మధ్య చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. మనోజ్ మొదటి పెళ్లికి ముందే మౌనికతో సన్నిహిత్యం ఉండేదట. అప్పట్లోనే పెళ్లి ప్రస్తావన రాగా, వద్దు అనుకున్నారట. దీంతో ఇద్దరూ వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. విడిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి కలిశారు. త్వరలోనే మ్యారేజ్ చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారట.
అదే సమయంలో మనోజ్ ఇక కొత్త సినిమాలు స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిపారు. ఆయన గతంలోనే `అహం బ్రహ్మాస్మి` చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఆగిపోయిందన్నారు. కానీ ఆయన ఈ సినిమాని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అలాగే కొత్త సినిమాని కూడా ఆయన ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఓ వైపు కొత్త జీవితం, మరోవైపు కొత్త కెరీర్ని స్టార్ట్ చేస్తూ దూసుకుపోవాలని భావిస్తున్నారు. కెరీర్ పరంగా ఏమేరకు సక్సెస్ అవుతారనేది చూడాలి.
మంచు మోహన్బాబు చిన్న కుమారుడైన మంచు మనోజ్ `1993లో `మేజర్ చంద్రకాంత్` చిత్రంతో బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. 2005లో `శ్రీ` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా జయాపజయాలు ఎదుర్కొన్నాడు. కానీ మేజర్ బ్రేక్ దక్కలేదు. చివరగా ఆయన `ఒక్కడు మిగిలాడు` చిత్రంలో నటించారు. ఆ సినిమా పరాజయం చెందింది. దాదాపు ఐదేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.