తన కూతురు నందన మరణం తర్వాత తాను అనుభవించిన తీవ్రమైన మానసిక వేదన గురించి గాయని కే.ఎస్. చిత్ర మనసు విప్పారు. సంగీత ప్రపంచానికి, దేవుడిపై నమ్మకానికి దూరమైన తనను.. మామూలు స్థితికి తీసుకురావడం కోసం ఇళయరాజా, లతా మంగేష్కర్ ఎలా సహాయం చేశారో ఆమె తెలిపారు.
దక్షిణ భారత చిన్న కోకిలగా అందరూ ప్రేమగా పిలుచుకునే గాయని కే.ఎస్. చిత్ర. ఆమె పాట వినని రోజు గడవదు. ఎన్నో భాషల్లో, ఎన్నో రకాల పాటలు పాడిన చిత్ర.. స్టార్ సింగర్ గా వెలుగు వెలిగారు. ఇక చిత్ర జీవితంలలో ఓ పెను విషాదం జరిగింది. ఆమె ఒక్కగానొక్క కూతురు గతంలో మరణించింది. చిత్ర కూతురు నందన ఈ లోకాన్ని విడిచి 15 ఏళ్లు దాటింది.
2011లో దుబాయ్లోని ఓ విల్లా స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు పడి నందన చనిపోయింది. అప్పుడు ఆమె వయసు తొమ్మిదేళ్లు. ఆ పెను విషాదం నుంచి తానెలా బయటపడిందీ, గుడికి వెళ్లాలనే ఆలోచనే రాని ఆ క్షణాల గురించి కే.ఎస్. చిత్ర ఇటీవలి ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు.
25
తిరిగి రావాలనే ఆలోచనే లేదు..
చిత్ర మాట్లాడుతూ.. "నన్ను మళ్లీ పాడించడానికి రంజినీ హరిదాస్, విజయ్ టీవీ రవూఫ్ చాలా ప్రయత్నించారు. నేను వస్తేనే షూటింగ్ మొదలవుతుందని ఎదురుచూసేవారు. ఏసియానెట్ ఛానల్ వాళ్లు ప్రతి నెలా రంజినీని మా ఇంటికి పంపేవారు. కానీ, అప్పుడు నాకు తిరిగి రావాలనే ఆలోచనే లేదు. అదే సమయంలో లతా మంగేష్కర్ పేరు మీద నాకు ఓ అవార్డు వచ్చింది. హైదరాబాద్ వెళ్లి దాన్ని నేను అందుకోవాలి. కానీ బయటకు వెళ్లే మూడ్లో నేను లేను. అప్పుడే లతా గారు నాకు ఫోన్ చేసి, 'నువ్వు కచ్చితంగా రావాలి' అన్నారు. నాకు తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు చాలామంది కౌన్సెలింగ్ ఇవ్వడానికి వచ్చారు," అని చిత్ర చెప్పారు.
35
ఇళయరాజా మాటల ప్రభావం..
"చాలా పెద్ద గ్యాప్ తర్వాత నేను మళ్లీ పాడటం మొదలుపెట్టాను. అది కూడా రాజా సర్ ప్రోగ్రాం. 'నేను పాడలేను' అని రాజా సర్తో చెప్పాను. కానీ, 'నువ్వు రాకపోతే, నేను ఈ ప్రోగ్రాంనే క్యాన్సిల్ చేసేస్తా' అని ఆయన అన్నారు. ఆ టైంలో, ఆయన భార్య చనిపోయి మూడు నెలలే అయింది. 'నాతో 33 ఏళ్లు బతికిన మనిషి పోయింది, నేను ప్రోగ్రాంకి రావట్లేదా? నువ్వు అలా అనుకోకూడదు, కచ్చితంగా రావాలి' అని చెప్పి నన్ను రప్పించారు," అని కే.ఎస్. చిత్ర గుర్తుచేసుకున్నారు. ధన్య వర్మతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిత్ర ఈ విషయాలు పంచుకున్నారు.
కూతురి మరణంతో దేవుడికి, తనకు మధ్య దూరం పెరిగిందని చిత్ర చెప్పారు. "ఇలా జరగడానికి నేనేం తప్పు చేశాను? ఎవరినైనా బాధపెట్టానా? రియాలిటీ షోలలో పిల్లల మనసు నొప్పించానా? అది శాపంగా మారిందా? ఇలా రకరకాల ఆలోచనలు వచ్చేవి. మనకు ఏం రాసిపెట్టి ఉంటే అది జరిగి తీరుతుంది. ఏ దేవుడిని మొక్కినా కష్టాలు వస్తాయి. వాటిని తట్టుకునే శక్తిని మాత్రమే దేవుడు ఇస్తాడు. ఆ సమయంలో గుడికి వెళ్లాలనే ఆలోచనే నాకు రాలేదు. ఏ గుడికీ వెళ్లొద్దు, ఎవరినీ కలవొద్దు అని ఉండేదాన్ని'' అని చిత్ర అన్నారు.
55
భగవంతుడే పిలుస్తున్నాడని అనిపించింది
త్రిస్సూర్లో ఓ కార్యక్రమం కోసం వెళ్లినప్పుడు, బస చేసిన రూమ్ గురువాయూర్ గుడి దగ్గర దొరికింది. భగవంతుడే నన్ను మళ్లీ పిలుస్తున్నాడని నాకు అనిపించింది. ఆ రోజు నేను గుడికి వెళ్లాను. చాలాసేపు ఏడ్చి తిరిగి వచ్చాను," అన్నారు చిత్ర. "ఇలా ఇంట్లోనే ఉండిపోవడం వల్ల, మనతో ఉన్నవాళ్ల జీవితం కూడా కష్టమవుతుందే తప్ప, మనం కోల్పోయింది తిరిగి రాదు. ఇది ఒక దశలో నాకు అర్థమైంది. నా చుట్టూ చాలా మంది ఉన్నారు. నేను డల్ అయితే, వాళ్ల జీవితాలు కూడా డల్ అవుతాయి కదా? దేవుడి నిర్ణయమే ఫైనల్. ఆ ఘటన తర్వాత నేను ప్లాన్ చేయడమే మానేశాను. ఏది వస్తే, దాన్ని అప్పుడు ఎదుర్కోవాలి," అని చిత్ర ఎమోషనల్ అయ్యారు.