
ప్రభాస్ మరోసారి బాక్సాఫీసుని షేక్ చేశాడు. గతేడాది డిసెంబర్లో `సలార్`తో దుమ్మురేపిన ఆయన ఇప్పుడు `కల్కి 2898ఏడీ`తో బాక్సాఫీసుకి పూనకాలు తెప్పిస్తున్నాడు. ఈ మూవీ కలెక్షన్ల పరంగా వెయ్యి కోట్లకు చేరువలో ఉంది. అయితే రెండు వారాలు దాటడంతో సినిమా చాలా వరకు డల్ అయ్యింది. కానీ ఇతర సినిమాలు పెద్దగా లేకపోవడంతో అది `కల్కి`కి కలిసి వస్తుంది.
తాజాగా కమల్ హాసన్ `ఇండియన్ 2`తో వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తుంది. ఇంకా చెప్పాలంటే కాస్త నెగటివ్ టాకే ఉంది. రొటీన్ మూవీ అని, కొత్తదనం లేదంటున్నారు. సినిమా ల్యాగ్ ఉండటం, కమల్ చివర్లో సందడి చేసినా సినిమాకది ప్లస్ కాలేకపోతుంది. క్లైమాక్స్ తప్ప సినిమా అంతా బోరింగ్గా ఉందని అంటున్నారు. శంకర్ ఏమాత్రం తన సత్తాని చాటలేకపోయాడని అంటున్నారు. సిద్ధార్థ్ రోల్ అతిగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
దీంతో ఇది ప్రభాస్ `కల్కి`కి ప్లస్గా మారింది. ఆ మూవీ ఈ వారం పుంజుకునే అవకాశం ఉంది. దీంతో వెయ్యి కోట్లు దాటి `ఆర్ఆర్ఆర్`, `కేజీఎఫ్2` రికార్డులను టార్గెట్ చేయబోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ మూవీ విషయంలో నిర్మాతతోపాటు బయ్యర్లు సేఫ్లో ఉన్నారు. లాభాలు ప్రారంభమయ్యాయి. చాలా రోజులు తర్వాత థియేటర్లు ఫుల్ కావడంతో ఎగ్జిబిటర్లు కూడా హ్యాపీ అనే చెప్పాలి.
`కల్కి 2898 ఏడీ`లో 40శాతం కథనే చెప్పారు నాగ్ అశ్విన్. ఇంకా 60శాతం కథ చెప్పాల్సి ఉంది. రెండో భాగంలో మిగిలిన కథ చెప్పనున్నట్టు తెలుస్తుంది. మొదటి భాగంలో కల్కి పుట్టుకకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. దీపికా పదుకొనె కడుపులో కల్కి ఉన్నాడని అంతా నమ్ముతున్నారు. ఆమెని కాపాడేందుకు అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) పోరాడుతున్నాడు. కానీ ఆమెని సుప్రీంకి పట్టించాలని భైరవ(ప్రభాస్) ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ రకంగా తాను కాంప్లెక్స్ లోకి వెళ్లి లైఫ్ని ఎంజాయ్ చేయాలని భావిస్తున్నాడు. క్లైమాక్స్ లో దీపికాని తీసుకుని ప్రభాస్ వెళ్లిపోతాడు.
అదే సమయంలో సుప్రీం.. తనకు దొరికిన ఒక్క చుక్క సిరంతో తిరిగి మామూలు మనిషి అవుతాడు. దీపికాని పట్టుకుని ఆమెలో పెరుగుతున్న బిడ్డని బయటకు రాకుండా చేసి, పూర్తి సీరం పొందేందుకు బయలు తేరుతాడు. మరోవైపు అమితాబ్ ఈ ఇద్దరిని ఆపబోతున్నాడు. సెకండ్పార్ట్ లో అశ్వత్థామ, భైరవ కలుస్తారని, సుప్రీంపై కలిసి పోరాడతారని తెలుస్తుంది. ఈ ముగ్గురి మధ్య యుద్ధమే రెండో భాగంలో దర్శకుడు నాగ్అశ్విన్ చూపించనున్నారు. సుప్రీం నుంచి తప్పించుకునేందుకు సుమతి పడే కష్టాలే రెండో పార్ట్ మెయిన్ స్టోరీ అని సమాచారం.
అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు.. `కల్కి 2`లోనూ కల్కి పుట్టడట. సినిమా మొత్తం సుప్రీంతో పోరాటమే ఉంటుందని, కమల్ హాసన్, ప్రభాస్ అమితాబ్ బచ్చన్ల మధ్యనే కథ సాగుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో `కల్కి` ఎప్పుడు పుడతాడనేది పెద్ద మిస్టరీగా మారింది. లేటెస్ట్ లీక్ ప్రకారం రెండో భాగంలోనూ కల్కి పుట్టడట. క్లైమాక్స్ లో అవతారపురుషుడు కల్కి జన్మిస్తాడని, ఆయన పుట్టుకతో ప్రపంచమే మారిపోతుందని సమాచారం. దాన్ని పీక్లో చూపించబోతున్నాడట నాగ అశ్విన్.
మొదటి భాగంలో`మహాభారతం` ఎలిమెంట్లు పిచ్చెక్కించిన నేపథ్యంలో రెండో పార్ట్ లోనూ అలాంటిదే ప్లాన్ చేస్తున్నాడట నాగ్ అశ్విన్. వాటితో ఆడియెన్స్ కి గూస్బంమ్స్ తెప్పించబోతున్నట్టు తెలుస్తుంది. ఇంటర్వెల్కి ఒకటి, క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ తో సినిమాని పీక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారట. `కల్కి 2` క్లైమాక్స్ లో పుట్టిన కల్కి.. `కల్కి 3`లో విశ్వరూపం చూసే అవకాశం ఉందని సమాచారం. సుప్రీంని అంతం చేసి నవ ప్రపంచాన్ని ఆయన సృష్టించే అవకాశం ఉందని టాక్.
ప్రస్తుతం `కల్కి 2898ఏడీ` సక్సెస్ని ఆస్వాదిస్తున్నారు మేకర్స్. అదే సమయంలో రెండో పార్ట్ కి సంబంధించిన ప్లానింగ్స్ కూడా జరుగుతున్నాయట. వచ్చే ఏడాది షూటింగ్ చేసి 2026లో రెండో పార్ట్ ని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్తోపాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన, మృణాల్ నటించి అలరించారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.