చిరంజీవికి చికెన్ గున్యా, ఆందోళనలో ఫ్యాన్స్! 25 రోజులుగా చికిత్స

First Published Sep 23, 2024, 9:12 AM IST

చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ న్యూస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. 
 

నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానం చిరంజీవి సొంతం.  నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ ని  మెగాస్టార్ చిరంజీవి ఏలారు. ఇండియన్ సినిమాకు ఆయన చేసిన సేవలకు గానూ ఇటీవల  భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ చే సత్కరించింది. 

తాజాగా మరో  అరుదైన గౌరవాన్ని చిరంజీవి అందుకున్నారు. గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు 156 చిత్రాల్లో నటించిన చిరంజీవి, 537 పాటలకు డాన్స్ చేశారు. ఈ పాటల్లో ఆయన 24 వేల డాన్స్ మూమెంట్స్ ప్రదర్శించారు. అందుకు గాను చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. 

Latest Videos


 ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు, బాలీవుడ్‌ నటుడు అమిర్‌ ఖాన్‌ ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి, గుణశేఖర్‌, బాబీతోపాటు..  నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్‌ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్‌, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవిని అభినందించారు. ఆయన కీర్తిని కొనియాడారు. 

Chiranjeevi Konidela

అయితే ఈ వేడుక సాక్షిగా ఓ ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారట. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ కి యాంకర్ గా ఉన్న యువతి ఈ విషయం వెల్లడించింది. చిరంజీవి గారు గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఉండి కూడా ఆయన ఈ ఈవెంట్ కి హాజరయ్యారని తెలిపారు. 

ఈవెంట్ లో చిరంజీవి కొంచెం నలతగా కనిపించారు. వేదికపైకి వెళ్లేందుకు చిరంజీవి సాయి ధరమ్ తేజ్ సహాయం తీసుకున్నారు. చిరంజీవి కి సపోర్ట్ గా సాయి ధరమ్ వేదిక వద్దకు వెళ్లారు. చిరంజీవి అనారోగ్యం పాలయ్యారన్న విషయం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో 'గెట్ వెల్ సూన్ మెగాస్టార్' అని పోస్ట్స్ పెడుతున్నారు. 

మరోవైపు విశ్వంభర విడుదల తేదీ దగ్గర పడుతుంది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. విశ్వంభర ప్రకటించిన తేదీకి రావాలంటే చిరంజీవి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. చిరంజీవి అనారోగ్యం పాలయ్యాడన్న వార్తలు విశ్వంభర విడుదలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 

షూటింగ్ ఆలస్యం అయితే సంక్రాంతి బరి నుండి విశ్వంభర తప్పుకోవాల్సి ఉంటుంది. బాలకృష్ణ NBK 109, వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలు సైతం పెద్ద పండగ రేసులో ఉన్నాయట. 

విశ్వంభర చిత్రానికి వశిష్ట దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో విశ్వంభర తెరకెక్కుతుంది. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. చిరంజీవి బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అదే సమయంలో వివాదాస్పదమైంది. చిరంజీవి త్వరగా కోలుకుని విశ్వంభర సంక్రాంతికి అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

click me!